ఊహలు గుసగుసలాగే, ఛలో లాంటి ప్రేమకథ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో లవర్బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు నాగశౌర్య. అభినయప్రధాన పాత్రలతో కథానాయికగా వైవిధ్యతను చాటుకుంటున్నది రీతూవర్మ. వీరిద్దరి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. లక్ష్మీసౌజన్య దర్శకురాలిగా పరిచయమైంది. నాగశౌర్యకు ఈ లవ్స్టోరీ కలిసివచ్చిందా?వరుస విజయాలతో దూసుకుపోతున్న సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాతో ఆ విజయ పరంపరను కొనసాగించిందా లేదా తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే…
భూమి(రీతూవర్మ) హైదరాబాద్లో ఏకో ఫ్రెండ్లీ స్టార్టప్ కంపెనీని నిర్వహిస్తుంటుంది. ఆఫీస్లో ఆమెను చూసి అందరూ భయపడుతుంటారు. ఏది ఆమెకు ఓ పట్టాన నచ్చదు. ముప్పై ఏళ్లు దాటిన పెళ్లి చేసుకోదు. భూమికి పెళ్లి చేయాలన్నది ఆమె తల్లి ప్రభావతి(నదియా) ఆశయం. కానీ తల్లి తీసుకొచ్చిన ప్రతి పెళ్లికొడుకును భూమి రిజెక్ట్ చేస్తుంటుంది. ఆకాష్(నాగశౌర్య) ఆర్కిటెక్చర్గా విదేశాల్లో మంచి పేరుతెచ్చుకుంటాడు. ఫారిన్ లైఫ్ైస్టెల్, సంస్కృతులు నచ్చకపోవడంతో హైదరాబాద్కు తిరిగివస్తాడు. భూమి పనిచేసే కంపెనీలో చేరతాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి తెగ ఆరాటపడతాడు. కానీ భూమి మాత్రం అతడిని ద్వేషిస్తూనే ఉంటుంది. ఆకాష్ను భూమి ద్వేషించడానికి కారణం ఏమిటి?అందరూ ఆడపిల్లల్లా సరదాగా ఉండే భూమి మనసు కఠినంగా ఎందుకు మారింది?ఆకాష్, భూమి మధ్య ఇదివరకే పరిచయం ఉందా?ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వారు ఎలా తెలుసుకున్నారన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
ఓ జంట జీవితంలోని భిన్న దశల్లో ఎదురైన అపోహలు, సంఘర్షణకు ప్రేమ, కుటుంబ విలువల్ని జోడిస్తూ దర్శకురాలు లక్ష్మీసౌజన్య ఈ కథను రాసుకున్నారు. జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుంటూ ముందుకు సాగాలి. అసలు ప్రశ్నే అడగకుండా సమాధానం కోసం ఎదురుచూడటంతో అర్థం లేదని పాయింట్తోఈ ప్రేమకథను అల్లుకున్నారు. ప్రేమను, ఇష్టాన్ని మనుసులోనే దాచుకోవడం కంటే దానిని వ్యక్తపరిచినప్పుడే ఎదుటివారికి అది అర్థమవుతుందని చూపించారు.
ధిక్కార మనస్తత్వం, జాలి, దయ లాంటి గుణాలేవి లేని కఠిన మనస్కురాలిగా భూమి పాత్రను పరిచయం చేస్తూ సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. భూమి పనిచేస్తున్న సంస్థలోనే ఆకాష్ ఉద్యోగంలో చేరడం..ఆమెను ఇంప్రెస్ చేయడానికి పడే పాట్లతో ప్రథమార్థం సరదాగా సాగుతుంది. ఈ ప్రేమ సన్నివేశాలతో పాటు అంతర్లీనంగా తల్లీకూతుళ్ల ఎపిసోడ్ను నడిపించారు దర్శకురాలు. అపరిచితులు అనుకున్న ఆకాష్, భూమి మధ్య ఇదివరకే పరిచయం ఉందంటూ ప్రథమార్థాన్ని ట్విస్ట్తో ముగించారు. ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకోవడం, వారి మధ్య ఏర్పడిన పరిచయంతో ద్వితీయార్థాన్ని రొమాంటిక్గా సాగుతుంది. ఆకాష్ను భూమి ఇష్టపడటం, అపోహలతో అతడికి దూరమవ్వడం..చివరకు వారు ఎలా ఒక్కటాయ్యరనేది సెంటిమెంట్, ఎమోషన్స్ను మేళవిస్తూ దర్శకురాలు ఆవిష్కరించారు.
దర్శకురాలు ఎంచుకున్న పాయింట్ చిన్నది కావడం సినిమాకు మైనస్గా మారింది. తమ ప్రేమను వ్యక్తపరచే అవకాశం ఉండి కూడా నాయకానాయికలు ఎందుకు కాలయాపన చేస్తున్నారనేది అంతుపట్టదు. అలాగే వారి మధ్య ప్రేమ జనించే సన్నివేశాలు, విడిపోవడానికి కారణమయ్యే అంశాలన్నీ సినిమాటిక్గా ఉన్నాయి. వాటిని రియలిస్టిక్గా రాసుకుంటే బాగుండేది.
గణేష్ రావూరి సంభాషణలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. వ్యంగ్యం, కుటుంబ అనుబంధాలను కలబోస్తూ నేటితరాన్ని మెప్పించేలా అర్థవంతంగా డైలాగ్స్ రాశారు. విశాల్ చంద్రశేఖర్, తమన్ బాణీల్లో కోలకళ్ల అమ్మాయి, దిగు దిగు నాగ మెప్పిస్తాయి. చిన్న చిత్రమనే భావన కలగకుండా నిర్మాత సూర్యదేవర నాగవంశీ బడ్జెట్ విషయంలో రాజీపడకుండా సినిమాను నిర్మించారు.
ఎవరికి తెలియని కథను చెప్పడమో, తెలిసిన కథను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించడంపైనే దర్శకుల ప్రతిభాపాఠవాలు ఆధారపడి ఉంటాయి. ఈ సినిమా విషయంలో దర్శకురాలు లక్ష్మీసౌజన్య రెండో దారిని ఎంచుకున్నారు. ప్రేమలో ఎదురయ్యే ఓ కామన్ పాయింట్ను తీసుకొని క్లాస్ లవ్స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారు. పాటలు, కథ, కథనాలు ప్రేక్షకులకు ఫ్రెష్ఫీల్ను కలిగిస్తాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మల్టీఫ్లెక్స్ ప్రేక్షకుల్ని ఈ సినిమా మెప్పిస్తుంది.