మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత మరో రెండు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. అందులో ఒకటి శంకర్ (Shankar) తో పాన్ ఇండియన్ సినిమా..మరొకటి యూవీ క్రియేషన్స్ లో సినిమా. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు మూడు కథలు కూడా విన్నాడు రామ్ చరణ్. ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ సినిమా అయిపోగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శంకర్ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు మెగా వారసుడు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివరి వారంలో మొదలు కానుందని తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు కూడా ఇదే చెప్పాడు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.
ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ ఫైనల్ అయింది. ఈ సినిమా కోసం ఏకంగా 4 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను శంకర్ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కియారా అద్వానీతో పాటు మరో హీరోయిన్ కూడా నటించబోతుంది. ఈ అవకాశం వకీల్ సాబ్ హీరోయిన్ (Vakeel Saab heroine)అంజలి (Anjali)కి దక్కిందని తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాలో తన ఎమోషనల్ నటనతో అందర్నీ కట్టిపడేసింది అంజలి. ఆ సినిమా చూసిన తర్వాత శంకర్ తన సినిమాలో అంజలికి అద్భుతమైన క్యారెక్టర్ ఇస్తున్నాడని తెలుస్తోంది.
తను రాసుకున్న ఆ పాత్రకు అంజలి అయితే బాగా న్యాయం చేస్తుందని ఈ దర్శకుడు నమ్ముతున్నాడు. దానికితోడు ఒకసారి మెగా కంపౌండ్ లో అడుగు పెట్టిన తర్వాత వరుస అవకాశాలు వస్తూనే ఉంటాయి. అల్లు అర్జున్ తో సరైనోడులో ఐటమ్ సాంగ్ చేసింది అంజలి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు రామ్ చరణ్ తో నటించే అవకాశం అందుకుంటుంది ఈ తెలుగమ్మాయి.
తమిళంలో కూడా అంజలికి మంచి ఫాలోయింగ్ ఉండటంతో శంకర్ ఆమె వైపు చూస్తున్నట్టు టాక్. ఈ పాత్ర కూడా హీరోయిన్ కు తక్కువ కాకుండా ఉంటుందని.. కథను మలుపు తిప్పే పాత్రలోనే అంజలి నటించబోతోందని తెలుస్తోంది. అన్నింటికి మించి దిల్ రాజు నిర్మాతగా ఇప్పటికే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో టైటిల్ రోల్ చేసింది అంజలి. ఇన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టే శంకర్ సినిమాలో ఈ రాజోలి సుందరికి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అంజలి కెరీర్ ఎలా మారబోతుందో చూడాలి.