Vaishnavi Chaitanya | ‘బేబీ’ సినిమాతో ఒక్కసారిగా యూత్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య.. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ‘బేబీ’లో ఆనంద్ దేవరకొండతో కలిసి నటించి సూపర్ హిట్ అందుకున్న ఈ జోడీ.. ఇప్పుడు ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో వైష్ణవి తన కెరీర్లో ఎదురైన కొన్ని ఆసక్తికర అనుభవాలను పంచుకున్నారు.
తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్న వైష్ణవి.. అప్పట్లో తనను కొందరు అడిగిన మాటలు చాలా బాధపెట్టాయని తెలిపారు.‘నిన్ను ఎవరు గుర్తుపడతారు? గూగుల్లో నీ పేరు కొడితే నీ గురించి ఏమైనా వస్తుందా?’ అంటూ ఒకప్పుడు తనను ప్రశ్నించారని వైష్ణవి వెల్లడించారు. ఆ మాటలు తనను ఎంతగానో బాధించాయని, అయితే ఆ అవమానాన్ని విజయంగా మార్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు తెలిపారు.ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వైష్ణవి అన్నారు. గూగుల్లో తన పేరు టైప్ చేస్తే తన గురించి పూర్తి వివరాలు కనిపిస్తున్నాయని, ఇదే తన జీవితంలో అత్యంత ఎపిక్ మూమెంట్ అని భావోద్వేగంతో చెప్పారు. ఇక ‘ఎపిక్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన నటి రష్మిక మందన్నకు వైష్ణవి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రష్మిక సినీ ప్రయాణం తనతో పాటు ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.
ప్రతి ఒక్కరిలోనూ ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుందని, మరొకరిలా మారాల్సిన అవసరం లేదనే విషయాన్ని రష్మిక తన కెరీర్ ద్వారా నిరూపించారని వైష్ణవి ప్రశంసించారు. ‘బేబీ’ సినిమా నుంచి ఆనంద్ దేవరకొండ తనకు తెలుసని చెప్పిన వైష్ణవి.. అప్పటితో పోలిస్తే ఇప్పటికీ ఆయనలో పెద్దగా మార్పు కనిపించలేదని సరదాగా అన్నారు. అయితే ఆనంద్ నుంచి తాను ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకున్నానని తెలిపారు. మన చుట్టూ ఉన్నవాళ్లు ఎదిగితే మనం కూడా సంతోషించాలి అనే విషయాన్ని ఆనంద్ తన ప్రవర్తనతో చూపిస్తారని, ఆయన చాలా అరుదైన వ్యక్తి అని వైష్ణవి పేర్కొన్నారు.
‘ఎపిక్’ దర్శకుడు ఆదిత్య హాసన్ గురించి కూడా వైష్ణవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య తనకు బెస్ట్ ఫ్రెండ్తో పాటు ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పారు.