సమాజంలో అమ్మాయిల పట్ల నెలకొన్న వివక్షను చర్చిస్తూ తెరకెక్కించిన చిత్రమిదని అన్నారు భార్గవ గొట్టిముక్కల. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘వధుకట్నం’. శ్రీహర్ష, ప్రియా శ్రీనివాస్, కవిత శ్రీరంగం, అనన్య ప్రధాన పాత్రల్ని పోషించారు. షేక్బాబు సాహేబ్ నిర్మించారు. నేడు విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు భార్గవ మాట్లాడుతూ ‘ఆడపిల్ల పుడుతుందని తెలియగానే చాలా మంది అబార్షన్ చేయించుకుంటున్నారు. భ్రూణ హత్యల కారణంగా అమ్మాయిల సంఖ్య తగ్గితే తలెత్తే పరిణామాలేమిటనే అంశాన్ని సందేశాత్మకంగా సినిమాలో చూపించబోతున్నాం. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరక్క వారికే ఎదురుకట్నం ఇవ్వాల్సివస్తుందనే పాయింట్ నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది. అని తెలిపారు. డబ్బు గురించి ఆలోచించకుండా సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో తెరకెక్కించిన చిత్రమిదని నిర్మాత షేక్ బాబు సాహేబ్ చెప్పారు.