జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’. ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కిషోర్ నాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించారు. బుధవారం గ్లింప్స్ను విడుదల చేశారు. ఆద్యంతం ఉత్కంఠభరిత సన్నివేశాలతో గ్లింప్స్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. లయతో కలిసి తాను మనోహరం, హనుమాన్ జంక్షన్ సినిమాలు చేశానని, ఇందులో కూడా లయ అద్భుతమైన పాత్రను పోషించిందని, ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యే కథ ఇదని అన్నారు.
సినిమా తీసి పదేళ్లయిందని, కథపై నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ను మొదలుపెట్టామని, జగపతిబాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఇలాంటి కథను తానెప్పుడూ వినలేదని, చివరి వరకూ ఉత్కంఠను పంచుతుందని కథానాయిక లయ చెప్పింది. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, రచన: లక్ష్మీభూపాల, దర్శకత్వం: ఆకెళ్ల వి కృష్ణ.