Pooja Hegde | బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. సల్మాన్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్నది. ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ పూజాహెగ్డే సల్మాన్కు జోడీగా కనిపించనున్నది. ప్రస్తుతం చిత్రబృందం సినిమాను ప్రమోట్ చేస్తున్నది. ఈ క్రమంలోనే పూజాహెగ్డే ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. చిత్రం విడుదల కోసం ఎగ్జియిటింగ్గా ఉన్నానని, అదే సమయంలో నెర్వస్గానూ ఉందని చెప్పింది. చిత్రంలో తన పాత్ర ప్రేక్షకులకు తప్పనిసరిగా నచ్చుతుందని ఆశిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ బ్యూటీ చివరగా ప్రభాస్తో ‘రాధే శ్యామ్’తో పాటు రణ్వీర్ సింగ్తో కలిసి ‘సర్కస్’ చిత్రంలో కనిపించింది. ఈ రెండు చిత్రాలు అనుకున్నంత స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేకపోయాయి. అయితే, ఇటీవల పూజా హెగ్డే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ ట్రైలర్ను షేర్ చేసింది. ఓ అభిమాని ‘ఈ సినిమా బాలీవుడ్లా లేదు. సౌత్ సినిమాలా ఉంది’ అంటూ కామెంట్ చేశాడు. దానికి పూజా తనదైన శైలిలో స్పందించింది. ‘నేను తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చాను. ప్రస్తుతం భారతీయ చిత్రపరిశ్రమ కలిసిరావడం సంతోకరమైన విషయం. సినిమాలో నాది తెలుగు అమ్మాయి పాత్ర. కాబట్టి బతుకమ్మను చూపించాం.
ఇది తెలుగువారి పండుగ. హిందీలో చూపిస్తే విచిత్రంగా ఉంటుంది. తెలుగులోనే చూపించాం. ఇది సినిమా స్క్రిప్ట్. ఇలాంటి పోలికలతో నేను బాధపడడం లేదు’ అంటూ పూజాహెగ్డే స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సల్మాన్ గురించి చెబుతూ.. ఆయన నిజాయితీపరుడని, కలిసి పని చేయడం చాలాబాగుందని తెలిపింది. సినిమా చేస్తున్నప్పుడు తనకు సహాయం చేశాడని చెప్పుకొచ్చింది. సినిమాకు ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించగా.. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్నది. చిత్రంలో విక్టరీ వెంకటేశ్, రాణా దగ్గుబాటి, భూమిక, జగపతి బాబు, షహనాజ్ గిల్, పాలక్ తివారీ, రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్ కీలకపాత్రల్లో నటించారు.