అల్లు శిరీష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. రాకేష్ శశి దర్శకుడు. జీఏ-2 పిక్చర్స్ పతాకంపై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘మిడిల్ క్లాస్ అబ్బాయి కథ ఇది. శిరీష్ ఈ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు’ అని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం యువత ఆలోచనలు ఎలా ఉన్నాయనే అంశాన్ని ఈ సినిమాలో చర్చించాం. నేటి యూత్ అందరికి కనెక్ట్ అవుతుంది’ అని దర్శకుడు చెప్పారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో మంచి కథతో పాటు కదిలించే భావోద్వేగాలున్నాయి. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా సినిమా గురించే ఆలోచిస్తారు’ అన్నారు.