అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో..’ రాకేష్ శశి దర్శకుడు. జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మించింది. నేడు విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ ‘యూత్ఫుల్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఫ్యామిలీ ఆడియెన్స్కు కూడా నచ్చుతుంది. నేటి యువత ప్రేమ, పెళ్లి విషయంలో నిర్దిష్టమైన అభిప్రాయాల్ని కలిగి ఉంటున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా పిల్లలు తాము అనుకున్న విధంగా జీవితాన్ని సాగిస్తే బాగుంటుందని కోరుకుంటారు. ఈ ఇద్దరి సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది.
ప్రేమ, పెళ్లి అంశాల్ని నాయకానాయికలు, వారి తల్లిదండ్రులు చూసే విధానం ఎలా ఉంటుందన్నదే పాయింట్ను ఈ సినిమాలో చర్చించాం. నేటి అమ్మాయిలు స్వతంత్ర భావాలతో జీవితాన్ని సాగిస్తున్నారు. తాము అనుకున్న రంగంలో స్థిరపడుతున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర నేటి తరం అమ్మాయిల్ని ప్రతిబింబిస్తుంది. బలమైన వ్యక్తిత్వంతో ఆమె పాత్ర సాగుతుంది. ఇప్పటివరకు అల్లు శిరీష్ ఈ తరహా పాత్ర చేయలేదు. మధ్యతరగతి అబ్బాయిగా ఆయన పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్లో కొత్త తరహా చిత్రమిది’ అని చెప్పారు.