Sequels | సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమిస్తున్నట్టు.. సినీలోకం సెంటిమెంట్ల చుట్టూ తిరుగుతుంది. కాకతాళీయంగానో, కావాలనుకునో ఒక ట్రెండ్ మొదలైందా.. ఓ దశాబ్దం పాటు అదే భ్రమలో తేలిపోతుంది.అలా రాజ్యమేలిన సబ్జెక్టులు కోకొల్లలు. ఇప్పుడు ఈ జాబితాలో సీక్వెల్ఫార్ములా వచ్చి చేరింది. ఈ ఈక్వేషన్ ఇవాళ్టిది కాకపోయినా బాహుబలి తర్వాత జోరందుకుంది. తాజాగా ప్రశాంత్ నీల్, ప్రభాస్కాంబోలో తెరకెక్కుతున్న ‘సలార్’ రెండు భాగాలుగా పలకరించనుందని తేలిపోయింది. ఈ నేపథ్యంలో సీక్వెల్ సూత్రంతో తెరకెక్కిన చిత్రాల సంగతులు తెలుసుకుందాం..
ఓ మోస్తరు కథ దొరికినా దానిని రెండు భాగాలుగా మలచడం మన దర్శకులకు కొత్తగా అబ్బిన విద్య. మొదటి భాగంలో పతాక సన్నివేశాల్లో ఉత్కంఠభరితమైన మలుపు తిప్పి.. సీక్వెల్కు నాంది పలుకుతున్నారు. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ ఈ ప్రశ్నతో బాహుబలి రెండో భాగంపై అంచనాలు ఆకాశానికి అందుకున్నాయి. ‘అధీరా’గా సంజయ్దత్ ఎంట్రీ ఇవ్వడంతో కేజీఎఫ్-2 రేటింగ్ పదింతలు పెరిగింది.
ఒక్క డైలాగ్తో, పవర్ఫుల్ సన్నివేశంతో పార్ట్ 2 గురించి వెయ్యి కండ్లతో ఎదురుచూసేలా చేయగలుగుతున్నారు దర్శకులు. మణిరత్నం మ్యాజిక్ ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రం రెండు భాగాలుగా వచ్చి తమిళనాట విజయఢంకా మోగించింది. బాహుబలి సక్సెస్ తర్వాత బడ్జెట్ లెక్కలు కూడా సీక్వెల్కు కలిసొస్తాయనే నమ్మకం ఏర్పడింది. దీంతో చాలామంది ఈ ఫార్ములాను ఎంచుకుంటున్నారు. దృశ్యం, కార్తికేయ, హిట్ తదితర చిత్రాలు రెండో భాగాలుగా వచ్చి దండిగా సొమ్ము కొల్లగొట్టాయి. ఈ ఏడాది సీక్వెల్ సిరీస్లో మరిన్ని మెగా సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి.
మొదటి భాగానికి, రెండో భాగానికి పెద్దగా లింక్ లేకుండా అవే పాత్రలతో వచ్చిన సినిమాలు గతంలోనూ ఉన్నాయి. శివనాగేశ్వర రావు దర్శకత్వంలో 1993లో విడుదలైన ‘మనీ’ చిత్రం అప్పట్లో పెద్ద సక్సెస్ సాధించింది. ఇవే పాత్రలతో ఆ మరుసటి ఏడాది విడుదలైన ‘మనీ మనీ’ కూడా మంచి సినిమాగా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. చిరంజీవి ‘శంకర్దాదా ఎంబీబీఎస్’ మెగా విజయం సాధించింది. మొదటి సినిమాలోని ప్రధాన పాత్రలను తీసుకొని దీనికి సీక్వెల్గా విడుదలైన ‘శంకర్దాదా జిందాబాద్’ కూడా ప్రేక్షకుల మెప్పు పొందింది. రవితేజ హీరోగా నటించిన ‘కిక్’ రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది. కొన్నాళ్లకు ఆయనే కథానాయకుడిగా విడుదలైన ‘కిక్-2’ ఆశించినంతగా అలరించలేదు. ఆర్య, ఆర్య-2 సీక్వెల్ చిత్రాల్లా కనిపించినా కథ, కథనాల్లో దేని ఫార్ములా దానిదే! ఈ విధానాన్ని మరింత సానబెట్టి మొదటి భాగానికీ, రెండో భాగానికీ కథతో ముడిపెట్టి, కొత్తపాత్రలు సృష్టించి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతున్నారు దర్శకులు.
భారతీయుడు రిటర్న్స్..
హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబోలో 1996లో వచ్చిన సెన్సేషన్ ‘భారతీయుడు’. అందులో వృద్ధ సేనాపతిగా కమల్ చేసిన మర్మ విన్యాసాలు ఎలా మర్చిపోగలం? రెహమాన్ సంగీతం ఇప్పటికీ అలరిస్తూనే ఉంటుంది. మళ్లీ ఇన్నాళ్లకు ‘భారతీయుడు-2’ తుది మెరుగులు దిద్దుకుంటున్నది. ‘భారతీయుడు’లో ‘ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను. భారతీయుడికి చావు లేదు’ అనే డైలాగ్ చెప్పించి.. రెండో భాగానికి లీడ్ వదిలిపెట్టాడు శంకర్. మళ్లీ పాతికేండ్ల తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కింది. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సేనాపతి ఏ తప్పును అరికట్టడానికి మళ్లీ వచ్చాడన్నది ఇప్పటికైతే మిస్టరీనే! ‘రోబో-2’ డిజాస్టర్గా మిగిలిపోవడంతో శంకర్ ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. తన శక్తియుక్తులన్నీ ధారపోసి తీర్చిదిద్దాడని టాక్! మొత్తంగా ‘భారతీయుడు’ చిత్రాన్ని వెర్రెక్కి చూసిన నిన్నటి తరం.. రెండో భాగం కోసం వెయ్యికండ్లతో ఎదురుచూస్తున్నది. మరి సేనాపతిని ఈ తరం ఎలా రిసీవ్ చేసుకుంటుందన్నది వేచి చూడాల్సిందే!!
మూలం ఖైదీ
కార్తీ హీరోగా 2019లో విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం ‘ఖైదీ’. యువ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ టేకింగ్కు అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ఆశ్చర్యపోయాయి. ఒకానొక రాత్రి జరిగిన ఉదంతాన్ని కన్నార్పకుండా చూసేలా సినిమాను తీర్చిదిద్ది ప్రేక్షకులను కట్టిపడేయడంలో విజయవంతం అయ్యాడు దర్శకుడు. గత ఏడాది బాక్సాఫీస్కు కొత్త నిర్వచనం చెప్పిన ‘విక్రమ్’ చిత్రాన్ని ‘ఖైదీ’ సినిమాకు సెమీ సీక్వెల్గా తెరకెక్కించాడు కనకరాజ్. ఒకవైపు ‘విక్రమ్’కు సీక్వెల్ ఉంటుందని ఆ సినిమా ైక్లెమాక్స్ ద్వారా చెప్పకనే చూపించాడు. మరోవైపు ‘ఖైదీ’కి ప్రీక్వెల్ ఉంటుందనీ ప్రకటించాడు. మొత్తంగా ఈ సినిమాలన్నిటికీ ‘ఖైదీ’ మూలపురుషుడు కావడం విశేషం!
ఎప్పుడొస్తావ్ పుష్ప?
విలక్షణ దర్శకుడు సుకుమార్ పక్కా కమర్షియల్, మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన సినిమా ‘పుష్ప’. సెట్లోకి రాకముందు ఒకే భాగంగా నిర్మిద్దామని భావించినా, కథ డిమాండ్ చేయడంతో రెండో భాగానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. 2021 ఆఖర్లో విడుదలైన ‘పుష్ప’ బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. టాలీవుడ్ ఐకానిక్ స్టార్ని పాన్ ఇండియా హీరోను చేసింది. బన్నీ స్టెప్పులకు ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరగడంతో సీక్వెల్పై మరింత కసరత్తు చేసింది ‘పుష్ప’ టీమ్. మూడు నెలల కిందట ‘పుష్ప ఎక్కడ?’ అంటూ విడుదల చేసిన టీజర్కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ హైప్ను మరింత పెంచుతూ అల్లు అర్జున్ డిఫరెంట్ గెటప్ లుక్ను రిలీజ్ చేసి అంచనాలు పెంచేశాడు సుకుమార్. ఇప్పటికీ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2024లో రిలీజ్ కానుంది. ఈ సీక్వెల్ కలెక్షన్స్ను ఎలా రూల్ చేస్తుందో!
అదే బాటలో మరికొన్ని
గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించింది ‘డీజే టిల్లు’. పబ్లిక్ టాక్తో కలెక్షన్ల వర్షం కురిపించింది. దీనికి సీక్వెల్గా రూపొందుతున్న ‘టిల్లు స్వేర్’ దసరా రేస్లో ఉంటుందని చెబుతున్నారు. సోషియో, హిస్టారికల్ మూవీ ‘బింబిసార’ చడీచప్పుడు లేకుండా విడుదలై రికార్డు వసూళ్లు రాబట్టింది. సినిమా సక్సెస్ తర్వాత సీక్వెల్కు శ్రీకారం చుట్టింది నిర్మాణ సంస్థ. ‘బింబిసార-2’ ఇదే ఏడాది ప్రేక్షకులను పలకరించనుంది. హిట్ ఫ్రాంచైజీపై వచ్చిన రెండు సినిమాలూ థియేటర్లకు ప్రేక్షకులను రప్పించాయి. గతేడాది డిసెంబర్లో అడవి శేష్ హీరోగా విడుదలైన ‘హిట్-2’ ఘన విజయం పొందింది. ఈ ఏడాది డిసెంబర్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘హిట్-3’లో నాని హీరోగా చేస్తుండటంతో అంచనాలు మరింతగా పెరిగాయి. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికీ సీక్వెల్ ఉంటుందని రాజమౌళి ప్రకటించడంతో ఎవరికి వారు అప్పుడే కథలు అల్లుకునే పనిలో ఉన్నారు. మొత్తంగా ఈ దశాబ్దిలో వెండితెరపై మరిన్ని సీక్వెల్స్ పలకరించడం ఖాయం!