Bigg Boss 7 | బిగ్బాస్ ఫినాలే సందర్భంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన విధ్వంసాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్పై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. తాజాగా ఇద్దరిని అరెస్టు చేశారు. బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ విజయోస్తు ర్యాలీ తీసిన ఇద్దరు కారు డ్రైవర్లు సాయికుమార్, రాజును అదుపులోకి తీసుకున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడనే వార్త ముందుగానే బయటకు పొక్కడంతో చాలామంది ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చేశారు. అదే సమయంలో అమర్దీప్ ఫ్యాన్స్ కూడా అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొందరు రోడ్డుపై నానా హంగామా చేశారు. ఇతర కంటెస్టెంట్ల కార్లపై దాడికి దిగారు. ఈ క్రమంలో అమర్దీప్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రోడ్డుపైనే కొట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. ఈ దాడులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్గా తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు అల్లర్ల వెనుక పల్లవి ప్రశాంత్ అభిమానుల ప్రమేయం ఉందని గుర్తించారు.ఈ మేరకు పల్లవి ప్రశాంత్, అతని అభిమానులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా పల్లవి ప్రశాంత్, ఏ-2గా అతని తమ్ముడు మనోహర్, ఏ-3గా మరో స్నేహితుడి పేరును నమోదు చేశారు. తాజాగా ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేశారు. విధ్వంసానికి సంబంధించిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా మరికొంతమంది ఆకతాయిలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.