డాక్టర్ రాజ్ కుమార్ , పార్వతమ్మ ముద్దుల తనయుడు పునీత్ రాజ్ కుమార్ చిన్న వయస్సులోనే కన్నుమూసి ఎంతో మంది అభిమానులకి విషాదం మిగిల్చాడు. ఆయన మరణించి 15 రోజుల పైనే అవతున్నా కూడా ఇంకా అభిమానులు ఏదో ఒక సందర్భంలో స్మరించుకుంటూనే ఉన్నారు. పునీత్ పేరుకి కన్నడ స్టార్ అయిన ఆయనకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
పునీత్ మరణం తర్వాత ప్రతి ఒక్కరు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ టీం పునీత్కి ఘన నివాళి అర్పించింది. షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో సమాజానికి పునీత్ చేసిన సేవల్ని గుర్తుచేస్తూ ఓ పర్ఫార్మెన్స్ ప్రదర్శించారు. అది ఎంతో మంది మనసులని గెలుచుకుంది. ‘దేవుడు చేయాల్సిన పనులన్నీ పునీత్ చేశారు. అందుకే.. నువ్వు భూమిపై ఏం చేస్తావ్? నా పక్కన కూర్చో అని ఆ దేవుడే ఆయన్ను తీసుకెళ్లాడేమో!’ అని ఇంద్రజ చాలా ఎమోషనల్గా చెప్పుకొచ్చారు.
‘బతికితే ఇలా బతకాలిరా అని ప్రతి ఒక్కరూ అనుకునేలా చేసిన ఏకైక స్టార్ ’ పునీత్ రాజ్ కుమార్ అని ఆది అన్నాడు. ‘ఆదివారం ఆడవాళ్లకు సెలవు’ పేరుతో రూపొందించిన ప్రత్యేక ఎపిసోడ్లో పునీత్ని స్మరించుకోగా, దీనిపై కన్నడిగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరాధ్య దైవంకి షోలో ఇలా ఘన నివాళి అర్పించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ షోలో రాజ్ తరుణ్, ‘ఇండియన్ ఐడల్ సీజన్-12’ ఫేం షణ్ముఖ ప్రియ సందడి చేశారు.షణ్ముఖ ప్రియ తన సింగింగ్ టాలెంట్తో అదరగొట్టేసింది. ఈనెల 21న కార్యక్రమం ప్రసారం కానుంది. కాగా, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన మరణించినప్పటి నుంచి ప్రతిరోజూ దాదాపు 30,000 మంది అభిమానులు ఆయన స్మారకాన్ని సందర్శిస్తున్నారు.