త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేశ్బాబు కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ ఈ సంక్రాంతికి సందడి చేయనున్నది. ఈ నెల 12న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్.. అల్లు అర్జున్తో సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని హారిక-హాసిని సంస్థ అధికారికంగా ప్రకటించింది కూడా. అయితే త్రివిక్రమ్ గురించి తాజా వార్త ఒకటి చక్కర్లు కొడుతున్నది. బన్నీ ప్రస్తుతం ‘పుష్ప-2’తో బిజీగా ఉన్నారు.
ఈ కారణంగా మాటల మాంత్రికుడితో అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఆలస్యం కానున్నది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ కూడా ప్లాన్ బీని సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. విక్టరీ వెంకటేశ్తో త్రివిక్రమ్ సినిమా చాలా రోజులుగా చర్చల్లో ఉంది. వెంకటేశ్ నటించిన ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాలకు త్రివిక్రమ్ రచన చేశారు. వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బావుండన్న ఆకాంక్ష ప్రేక్షకుల్లోనూ ఉంది. త్రివిక్రమ్, వెంకీ కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నారు.
అందుకోసం ఓ ఫ్యామిలీ డ్రామాను త్రివిక్రమ్ రాసుకున్నారట. అయితే, ఇది సోలో హీరో సినిమా కాదని, త్రివిక్రమ్ దీన్ని మల్టీ స్టారర్గా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాలో మరో హీరోగా నాని కనిపించబోతున్నారని టాక్. ఇండస్ట్రీలో కాంబినేషన్ల ఈక్వేషన్లు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పడం కష్టం. బహుశా అందుకే ఈ మల్టీ స్టారర్ ఫిల్మ్ వివరాలు గోప్యంగా ఉంచారేమో!