షణ్ముఖ పురాణంలోని కీలకఘట్టం ఆధారంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ పౌరాణిక స్క్రిప్ట్ని సిద్ధం చేసుకున్నారు. పానిండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించాలనేది ఆయన ఉద్దేశ్యం. ఆ కథను ముందు అల్లు అర్జున్కి వినిపించారు. ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్ దగ్గరకొచ్చింది. మళ్లీ ఇది బన్నీ దగ్గరకెళ్లిందంటూ వార్తలొచ్చాయి. అయితే.. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఎన్టీఆరే కథానాయకుడని తెలుస్తున్నది.
ఈ భారీ పానిండియా పౌరాణిక చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తారు. ఈ విషయాన్ని మీడియా సాక్షిగా గతంలోనే చెప్పారాయన. ఇందులో కుమారస్వామిగా తారక్ కనిపిస్తాడని తెలుస్తున్నది. ఇదిలావుంటే.. ఇటీవలే నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ని రిజిస్టర్ చేయించారు. ఇది తారక్ సినిమా కోసమే అని ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. తారక్ పుట్టిన రోజైన మే 20న ఈ సినిమాకు సంబంధించిన తొలి అప్డేట్ని మేకర్స్ విడుదల చేయనున్నట్టు సమాచారం.