Trisha | కోలీవుడ్లో తాజాగా ఒక వివాదం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటి త్రిష కృష్ణన్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఆమె చేసిన వ్యాఖ్యలు దర్శకుడు-నటుడు ఆర్. పార్థిబన్ను ఉద్దేశించినవేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇటీవల ఒక అవార్డు కార్యక్రమంలో తన గురించి చేసిన వ్యాఖ్యలపై ఆమె పరోక్షంగా స్పందించినట్లు తెలుస్తోంది.
త్రిష తన పోస్ట్లో ఒక ఈవెంట్ నిర్వాహకులు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఒక వ్యక్తి తన అసిస్టెంట్ ద్వారా కోరడంతోనే చివరి నిమిషంలో ఆ కార్యక్రమంలో తన పేరు, ఫోటోను చేర్చారని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ త్రిష తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అలాగే తనపై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందిస్తూ, “చేతిలో మైక్రోఫోన్ ఉన్నంత మాత్రాన చేసే వ్యాఖ్యలు తెలివైనవిగా లేదంటే సరదాగా మారవు. అలా మాట్లాడటం వల్ల కేవలం అజ్ఞానం మరింత గట్టిగా వినిపించడమే జరుగుతుంది. అవతలి వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా అసభ్యకరంగా మాట్లాడటం వారి సంస్కారాన్ని వెల్లడిస్తుంది” అంటూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది.
దీనికి స్పందించిన పార్థిబన్.. ఈ విషయంలో జరిగినది చాలా తప్పుగా అనుకున్నారు. నేను ఇప్పుడు పశ్చాతాపం చెందడం తప్ప మరో మార్గం లేదని అన్నాడు. దీంతో వివాదానికి పులిస్టాప్ పడట్టు అయింది. అయితే ఈ వివాదానికి కారణమైన సంఘటన ఇటీవల జరిగిన ఒక అవార్డు వేడుకలో చోటుచేసుకుంది. ఆ కార్యక్రమంలో ఆర్. పార్థిబన్ స్టేజ్పై మాట్లాడుతున్న సమయంలో స్క్రీన్పై త్రిష ఫోటో కనిపించడంతో .. “ఈ కుందవైని కొంతకాలం ఇంట్లోనే ఉంచాలి” అంటూ వ్యాఖ్యానించారు. ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో త్రిష పోషించిన పాత్ర పేరు కుందవై అనే విషయం తెలిసిందే. ఇటీవల ఒక వివాహ వేడుకకు త్రిష, నటుడు మరియు రాజకీయ నాయకుడు విజయ్ కలిసి హాజరుకావడంపై సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లను ఉద్దేశిస్తూ పార్థిబన్ ఈ వ్యాఖ్యలు చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి.