Trisha | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల నిర్వహించిన ఆడియో లాంచ్ ఈవెంట్కు సూర్యతో పాటు చిత్ర బృందం హాజరైంది. అయితే, హీరోయిన్ త్రిష గైర్హాజరు కావడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కొందరు నెటిజన్లు ఆమె ప్రమోషన్స్కి దూరంగా ఉంటుందని విమర్శలు గుప్పించారు.
కానీ అసలు ట్విస్ట్ తరువాత బయటపడింది. ఆ ఈవెంట్కు త్రిషకు ఆహ్వానం అందలేదని సమాచారం. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా వెల్లడించింది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ వీడియోలో త్రిష ‘ప్రీతి’ అనే లాయర్ పాత్రలో కనిపించనుంది. ఆమె లుక్పై ఓ నెటిజన్ ప్రశంసలు కురిపించగా, త్రిష “థ్యాంక్స్.. నేనూ మర్చిపోయాను. ఇప్పటికైనా గుర్తు చేసినందుకు సంతోషంగా ఉంది” అంటూ సెటైరికల్గా స్పందించింది. ఇదే సమయంలో సూర్య అభిమాని ఒకరు “ఆడియో లాంచ్కు రాని మీరు ఇలా కామెంట్స్ చేయడం సరైందా?” అని ప్రశ్నించగా, త్రిష “నా ఇన్విటేషన్ మెయిల్లో మిస్ అయి ఉండొచ్చు” అని సమాధానం ఇచ్చింది. ఈ కామెంట్తో తనను ఆ వేడుకకు ఆహ్వానించలేదనే విషయాన్ని ఆమె స్పష్టంగా తెలియజేసింది.
ఈ వ్యవహారం త్రిష అభిమానుల్లో ఆగ్రహం రేపుతోంది. పోస్టర్లలో ఆమె పేరును ఉపయోగిస్తూ, ఈవెంట్కు ఆహ్వానం ఇవ్వకపోవడం సరైంది కాదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. “ఒక స్టార్ హీరోయిన్ను ఇలా ట్రీట్ చేస్తారా?”, “ఈ విషయంపై సూర్య స్పందించాలి” అంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు పెరుగుతున్నాయి. సినిమా విడుదలకు ముందే ‘కరుప్పు’ టీమ్ చుట్టూ ఈ వివాదం హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ సమస్యపై మేకర్స్ ఎలా స్పందిస్తారో, సినిమా రిలీజ్పై దీనికి ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాల్సి ఉంది.