‘కేజీఎఫ్’ఫేం యష్ కథానాయకుడిగా రూపొందుతున్న హై ఓల్టేజ్ ఎమోషనల్ కమర్షియల్ థ్రిల్లర్ ‘టాక్సిక్ : ఎ ఫెయిరీటెల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ పానిండియా చిత్రాన్ని వెంకట్ కె.నారాయణతో కలిసి యష్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న సినిమా విడుదల కానున్నది. బాలీవుడ్ నటి కియారా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె పాత్ర పేరు ‘నాడియా’. ప్రమోషన్స్లో భాగంగా సినిమాలోని ఆమె ఫస్ట్లుక్ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ని గమనిస్తే.. ఇందులో కియారా హాలీవుడ్ హీరోయిన్ స్థాయిలో కనిపిస్తుంది. ఆమె నేపథ్యం కలర్ఫుల్గా ఉంది.
ఈ హంగామా వెనుక ఏదో విషాదం దాగి ఉన్నట్టు అనిపిస్తున్నది. ఆమె కళ్లలో లోతైన భావోద్వేగాలు ఆవిష్కృతమవుతున్నాయి. నడియాగా ఇంతవరకూ చూడని కొత్త కియారాని ఈ సినిమాలో చూస్తారని, ఒక డైరెక్టర్గా ఆమె నటన చూసి గర్విస్తున్నానని గీతూ మోహన్దాస్ తెలిపారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతోపాటు మరికొన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. అంతర్జాతీయ హంగులతో, అద్భుతమైన సాంకేతిక నిపుణులతో రూపొందుతున్న ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్ రవి, సంగీతం: రవి బస్రూర్, నిర్మాణం: కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్.