‘బాహుబలి’ కంటే ముందు దక్షిణాది చిత్రాలంటే హిందీ వాళ్లు చిన్నచూపు చూసేవారని, రాజమౌళి వల్లే సౌత్ సినిమా ఉత్తరాదిన తిరుగులేని ప్రాచుర్యం సంపాదించుకుందని చెప్పారు కన్నడ అగ్ర హీరో యష్. ‘కేజీఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన..ఇటీవల ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సౌతిండియా ఇండస్ట్రీపై ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. దర్శకుడు రాజమౌళిని పొగడ్తల్లో ముంచెత్తారు.
దేశీయ సినిమా అంటే తొలుత హిందీనే పరిగణించేవారని, ‘బాహుబలి’ ఆగమనంతో దక్షిణాది చిత్రాలు హిందీతో పోటీ పడ్డాయని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘ఒకప్పుడు సౌత్ సినిమాల్లో పోరాట ఘట్టాల్ని చూసి ఎగతాళి చేసేవారు. క్రమంగా వారు దక్షిణాది సృజనాత్మకతను అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ‘బాహుబలి’ తర్వాత హిందీ ప్రేక్షకులు దక్షిణాది చిత్రాలపై ఇష్టాన్ని పెంచుకున్నారు. ఆ క్రెడిట్ రాజమౌళికే దక్కుతుంది. ఆయన వల్లే దక్షిణాది చిత్రాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం సౌత్ సినిమాలను అందరూ గుర్తిస్తున్నారు’ అన్నారు.