Lady villains in Tollywood | హీరోయిన్లు అంటే అందాల బొమ్మలు ! తమ గ్లామర్తో సిల్వర్స్క్రీన్ను కలర్ఫుల్గా మార్చేస్తారు ! లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మినహాయిస్తే చాలా సినిమాల్లో హీరోయిన్లు అంటే ఇలాగే ఉంటారనే భావన చాలామందిలో ఉంది. అయితే ఇది అన్ని సందర్భాల్లో కాదని నిరూపిస్తున్నారు పలువురు హీరోయిన్లు. కమర్షియల్ సినిమాల్లోనూ విలనిజంతో ఆకట్టుకుంటున్నారు. నెగెటివ్ రోల్స్లో భయపెట్టించేస్తున్నారు. ఇలా తెలుగు తెరపై మెప్పించిన లేడీ విలన్లు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం..
ఇప్పటివరకు తన అందంతో.. నటనతో ఫ్యాన్స్ను ఆకట్టుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా ఇప్పుడు విలన్గా కూడా మారింది. హిందీలో సూపర్హిట్గా నిలిచిన అంధాధూన్ చిత్రం రీమేక్లో ఈమె నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించింది. టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లోనటించిన అంధాధూన్ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ రీమేక్ చేశాడు. మాస్ట్రో సినిమాలో టబు పాత్రను తమన్నా పోషిస్తోంది. తనకు ఇబ్బందిగా అనిపిస్తే చంపేయడానికి కూడా వెనకాడని క్యారెక్టర్లో తమన్నా తొలిసారిగా నటిస్తోంది. ఈ సినిమాలో త్వరలోనే డిస్నీ హాట్స్టార్లో విడుదల కానుంది. మరి తొలిసారి నెగెటివ్ క్యారెక్టర్లో తమన్నా ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.
తన గ్లామర్తో ఒకప్పుడు దక్షిణాది సినీ ఇండస్ట్రీలను ఊపేసింది రమ్యకృష్ణ. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా భక్తిరస చిత్రాల్లోనూ నటించింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా విభిన్న క్యారెక్టర్లలో నటించి తనలోని నటిని అందరికీ పరిచయం చేసింది. నెగెటివ్ పాత్రల్లోనూ తనకు ఎవరూ సాటిరారని నిరూపించుకుంది. ముఖ్యంగా నరసింహ సినిమా ఆమె విలనిజం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ! సూపర్స్టార్ రజినీకాంత్కు ధీటుగా డైలాగులు డెలివరీ చేయడం, ఆమె మ్యానరిజం ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటాయి.
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన రాశి ఆ తర్వాత హీరోయిన్గా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో నటిస్తూ అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్కు చేరువైంది. అలాంటి సమయంలో తేజ నిజం సినిమాలో విలన్గా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఛాన్స్ వస్తే నెగెటివ్ పాత్రల్లోనూ మెప్పించగలనని మల్లి పాత్రతో నిరూపించింది రాశి. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. మల్లి పాత్రకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్లో నటించింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన రాశి.. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.
తెలంగాణ యాసతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాదు.. భయపెట్టడమూ తెలంగాణ శకుంతలకు బాగా తెలుసు. నువ్వు నేను సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ ఆమె పండించిన విలనిజాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ సినిమా తర్వాత గంగోత్రి, ఒక్కడు వంటి సినిమాల్లో ఫ్యాక్షన్ పాత్రలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత కామెడీ విలన్గా తనకంటూ ప్రత్యేకమైన మార్క్ను క్రియేట్ చేసుకుంది.
ఇటీవల కాలంలో లేడీ విలన్గా ఎక్కువగా వినిపిస్తున్న పేరు వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ ఏడాది మొదట్లో రిలీజైన క్రాక్ సినిమాలో ఆమె పోషించిన జయమ్మ పాత్ర ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా కంటే ముందు కూడా తమిళంలో ఈమె చాలా సినిమాల్లో కథానాయికగా నటించింది. ఆ తర్వాత పందెం కోడి 2, సర్కార్ వంటి సినిమాల్లో విలన్గానూ మెప్పించింది. తెలుగులో తెనాలి రామకృష్ణ సినిమాలోనూ విలన్గా నటించింది. కానీ క్రాక్ సినిమాలోని జయమ్మ పాత్ర ఆమెకు తెలుగులో మంచి బ్రేక్ ఇచ్చింది.
ప్రయోగాలు చేయడంలో అక్కినేని కోడలు సమంత ఎప్పుడూ ముందుంటారు. క్యూట్ గర్ల్, పక్కింటి అమ్మాయి పాత్రలతో అలరించే సామ్.. అప్పుడప్పుడూ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లోనూ మెప్పిస్తూనే ఉంది. హిందీలో పాపులర్ వెబ్ సిరీస్ అయిన ఫ్యామిలీమ్యాన్ 2 సినిమాలో టెర్రరిస్ట్గా ఆమె నటించి మెప్పించారు. అంతకుముందు తమిళంలోనూ తన విలనిజాన్ని చూపించింది సమంత. తమిళంలో విక్రమ్ హీరోగా వచ్చిన 10 సినిమాలో విలన్గానూ నటించింది. ఆ సినిమాలో దమ్ము కొడుతూ, మర్డర్లు చేస్తూ ఆమె పండించిన విలనిజం సామ్ అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది.
జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకవైపు బుల్లితెరపై యాంకరింగ్ చేసుకుంటూనే.. వెండితెరపై తన సత్తా చాటుతుంది. ఆచితూచి కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన క్షణం సినిమాలో ఆమె విలన్ పాత్రలో మెప్పించింది. అందులో ఆమెది పోలీసు పాత్రే అయినా.. క్లైమాక్స్కి వచ్చేసరికి నెగెటివ్ పాత్ర అని తెలుస్తుంది. ఈ సినిమాలో అనసూయ నటన అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాలో కీలక పాత్రలో అనసూయన నటిస్తుంది. ఇందులో ఈమె పాత్ర నెగెటివ్ షేడ్లో సాగుతుందని సమాచారం.
కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకు పరిమితమైన రెజీనా.. అవకాశం చిక్కినప్పుడల్లా తనలోని నటిని బయటకు తెస్తూనే ఉంది. వెంకట్ రాంజీ దర్శకత్వంలో అడవి శేష్ కథానాయకుడిగా వచ్చిన ఎవరు సినిమాలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఆమె నటించింది. చేసిన క్రైమ్ బయటపడకుండా ఇంటెలిజెంట్గా వ్యవహరించే మహిళ పాత్రలో తన నటనతో మెప్పించింది రెజీనా.
మంచు వారమ్మాయిగా తెలుగులో అరంగేట్రం చేసిన తొలి సినిమాలోనే విలన్గా నటించి భయపెట్టించింది మంచు లక్ష్మీ. సిద్ధర్థ్ హీరోగా నటించిన అనగనగ ఓ ధీరుడు చిత్రంలో ఈమె మాంత్రికురాలు ఐరేంద్రి పాత్రలో మెప్పించింది. ఈ సినిమాలో తన నటనతో ఉత్తమ విలన్గా నంది పురస్కారం కూడా అందుకుంది.
ఎవరైనా సరే మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గర కావాలని చూస్తారు. కానీ తొలి సినిమాలోనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించేందుకు డేరింగ్ స్టెప్ తీసుకుంది పాయల్ రాజ్పుత్. ఆర్ఎక్స్ 10 సినిమాలో ఒకవైపు బోల్డ్గా కనిపిస్తూనే.. తన స్వార్థం కోసం ప్రేమించి మోసం చేసే యువతి పాత్రలో మెప్పించింది.