వెలుగునీడల వర్ణచిత్రంలా గత ఏడాది కాలయవనికపై నుంచి మెల్లగా కనుమరుగైపోయింది. నవప్రభాతపు కాంతుల్ని వర్షిస్తూ కొత్త వసంతం అరుదెంచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సినిమాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ వెలువడ్డాయి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘లైగర్’ ఫస్ట్గ్లింప్స్, చిరంజీవి ‘ఆచార్య’, రవితేజ ‘ఖిలాడి’, నాగార్జున ‘బంగార్రాజు’ చిత్రాల తాలూకు కొత్త పోస్టర్స్ విడుదలయ్యాయి.
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. రామ్చరణ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్రెడ్డి నిర్మాతలు. ఫిబ్రవరి4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్త పోస్టర్ను విడుదల చేశారు. పాట తాలూకు ఈ స్టిల్లో చిరంజీవి హుషారుగా నర్తిస్తూ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ఆచార్యుడిగా, నక్సలైట్గా భిన్న కోణాలున్న పాత్రల్లో కనిపించనున్నారని చెబుతున్నారు. కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందిస్తున్నారు. తిరుణ్ణావుక్కరుసు ఛాయాగ్రహణం బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
ముంబయి వీధుల్లో చాయ్వాలా అంతర్జాతీయ బాక్సర్గా ఎదిగిన వైనాన్ని అత్యంత శక్తివంతంగా ఆవిష్కరిస్తూ ‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్ శుక్రవారం విడుదలైంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ మార్షల్ ఆర్ట్స్ నేపథ్య చిత్రం దేశవ్యాప్తంగా ఆసక్తినిరేకెత్తిస్తున్నది. రొమాంచితమైన యాక్షన్ విన్యాసాలతో విడుదలైన ఫస్ట్గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచే విధంగా ఉంది. ఇందులో విజయ్దేవరకొండ ఎనిమిదిపలకల దేహంతో పవర్ఫుల్ అవతారంలో దర్శనమిచ్చారు. ‘వీ ఆర్ ఇండియన్స్’ అంటూ దేశభక్తిని ఉప్పొంగిస్తూ…‘వాట్ లగా దేంగే’ అంటూ ప్రత్యర్థులకు హెచ్చరిక చేస్తూ విజయ్దేవరకొండ తనదైన అభినయంతో అదరగొట్టాడు. యాక్షన్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ఫస్ట్గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ పతాకాలపై కరణ్జోహార్, అపూర్వ మెహతా, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఆగస్ట్ 25న విడుదలకానుంది.
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. రమేష్వర్మ దర్శకుడు. సత్యనారాయణ కోనేరు నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉంది. ఈ సినిమాలోని ‘అట్టా సూడకే..మత్తెక్కుతాంది ఈడుకే..ఒంట్లో వేడికే పిచ్చెక్కుతాంది నాడికే..’అనే పల్లవితో సాగే పాటను శుక్రవారం విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరాల్ని సమకూర్చిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్నందించారు. దేవిశ్రీప్రసాద్, సమీరాభరద్వాజ్ ఆలపించారు. మీనాక్షిచౌదరి, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకురానుంది.
అక్కినేని నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. కళ్యాణ్కృష్ణ కురసాల దర్శకుడు. శుక్రవారం కొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో నాగార్జున, నాగచైతన్య మీసాలు మెలి తిప్పుతూ కనిపిస్తున్నారు. ‘షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాదే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని చిత్రబృందం తెలిపింది.