కాలానికి ఆగడం తెలియదు! కానీ, ఆ కాలప్రవాహంలో ఎదురయ్యే కొన్ని సందర్భాలు ఎంతకాలమైనా చెరిగిపోవు. విజయాలే కాదు,పరాజయాలూ కలకాలం నిలిచిపోతాయి. వ్యక్తిగత అనుభవాలు అటుంచితే, సినిమాల విషయంలో జయాపజయాలు ఆ కాలాన్ని పదేపదే గుర్తుచేస్తాయి. అలా 2022లో తీపి విజయాలు పంచిన సినిమాల్లాగే.. చేదు పరాజయాలను మూటగట్టుకున్నవి ఎన్నో! ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర బోర్లాపడ్డ సినిమాల జాబితా పెద్దదే! భారీ అంచనాలతో విడుదలై ఉసూరుమనిపించిన చిత్రాలేంటో ఓ లుక్కేద్దాం!!
అయ్యయ్యో.. ఆచార్య!
మెగాస్టార్కు 2022 మిశ్రమ ఫలితాలను ఇచ్చిందనే చెప్పాలి. అంతకుముందు సంవత్సరం ‘సైరా నరసింహారెడ్డి’ హిట్తో జోరుమీదున్న చిరంజీవి ఈ ఏడాదీ అదే విజయపరంపర కొనసాగిస్తాడని అభిమానులు ఆశించారు. దీనికితోడు ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో సినిమా అనగానే బాస్కు మెగాహిట్ ఖాయమని ఫిక్సయ్యారు. పైగా రామ్చరణ్ తోడవ్వడంతో బాక్సాఫీస్ రికార్డులు తెరమరుగవుతాయని భావించారు. అయితే, సినిమా విడుదలయ్యాక సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు, మెగా అభిమానులు సైతం ఉసూరుమన్నారు. కథ, స్క్రీన్ప్లే పేలవంగా ఉండటంతో ‘ఆచార్య’ మెగాఫ్లాప్ అయింది. అయితే ఈ పరాజయంలో సింహభాగం కొరటాల ఖాతాలో పడింది. ఏదైతేనేం.. ‘ఆచార్య’ మీద అంచనాలు పెంచుకున్న అభిమానులు మాత్రం ‘అయ్యయ్యో!’ అనుకున్నారు. దసరా రేసులో విడుదలైన ‘గాడ్ఫాదర్’ హిట్ అవడం ‘ఆచార్య’ పరాజయ భారాన్ని కొంత తగ్గించినట్టయింది.
ఖిలా‘డీలా’..
మాస్ మహారాజా రవితేజకు 2022 అంతగా అచ్చిరాలేదనే చెప్పాలి. 2021లో క్రాక్ సూపర్ హిట్తో ఫామ్లోకి వచ్చిన రవితేజ ఈ ఏడాది అదే జోరును కొనసాగించలేక పోయాడు. ఈ సంవత్సరం ఆయన నటించిన రెండు సినిమాలు.. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ విడుదల అయ్యాయి. రెండూ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నా బాక్సాఫీస్ వసూళ్ల దగ్గర డీలా పడ్డాయి. సాగతీత సన్నివేశాలు, బలహీనమైన క్లయిమాక్స్ ఖిలాడీకి మైనస్ అయ్యాయి. ‘ఖిలాడీ’తో పోలిస్తే ‘రామారావు ఆన్ డ్యూటీ’ మంచి వసూళ్లు సాధించినప్పటికీ, రవితేజ స్థాయికి తక్కువే అని ఇండస్ట్రీ టాక్! శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్గా నటించాడు. నేర పరిశోధన నేపథ్యంలో కథ సాగుతుంది. కథనంలో వేగం తగ్గడం సినిమాకు మైనస్ పాయింట్గా నిలిచింది. ఫలితం.. ఓటీటీలో దక్కినంత ఆదరణను వెండి తెరపై నోచుకోలేకపోయింది.
బ్యాడ్లక్ సఖి
‘మహానటి’ సినిమాతో తెలుగువారి ఆరాధ్యనటిగా మారింది కీర్తిసురేశ్. దీంతో ఆమె నటించిన చిత్రం అనగానే అభిమానులు ఆత్రుతగా ఎదురుచూడటమూ మొదలైంది. ఇలాంటి అంచనాల మధ్యే విడుదలైంది ‘గుడ్లక్ సఖి’. నాగేశ్ కుకునూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 28న రిలీజైంది. నాయికా ప్రాధాన్య కథకు క్రీడా నేపథ్యం జత కావడంతో విడుదలకు ముందు ఊరించిన మాట వాస్తవమే! కీర్తితోపాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు వంటి నటులు అదనపు బలాలుగా కనిపించారు. అయితే, పేలవమైన స్క్రీన్ప్లే ‘గుడ్లక్ సఖి’ని ట్రాక్ తప్పించింది. భావోద్వేగాలు అంతంత మాత్రంగానే పండటంతో సినిమా ఫలితం బ్యాడ్లక్ అనిపించింది. ఏ అంచనాలూ లేకపోతే.. ఓ మోస్తరుగా ఆడేదేమో! కానీ, ప్రమోషన్లో భాగంగా సృష్టించిన హైప్ సినిమాలో కనిపించక పోయేసరికి ఉసూరుమంది.
స్టోరీ ‘లైన్’ లేదు..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఖాతాలో ఈ ఏడాది భారీ ఫెయిల్యూర్ నమోదైంది. భారీ బడ్జెట్తో రూపొందిన ‘రాధేశ్యామ్’ అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోయింది. తెరమీద ప్రభాస్, పూజా హెగ్డే జంట నిండుగా కనిపించినా.. కథ లోపించడం సినిమా పరాజయానికి కారణమైంది. ప్రేమకూ, విధికీ మధ్య సంఘర్షణ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై విడుదలకు ముందు అంతులేని అంచనాలు నెలకొన్నాయి. రూ.300 కోట్ల పెట్టుబడితో, విదేశాల్లో షూటింగ్ జరుపుకొన్న ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ దగ్గర మాత్రం తేలిపోయింది. కథకు తగ్గట్టుగా భావోద్వేగాలు పండకపోవడం ప్రధాన లోపం. హస్త సాముద్రిక శాస్త్రంలో నిపుణుడైన కథా నాయకుడు తన చేతిలో లవ్లైన్ లేదంటూ కథానాయికను దూరంగా పెట్టడం ప్రేక్షకులకు పరీక్షలాంటిదే! సెట్టింగులు, లొకేషన్ల హంగామా తప్ప కథలో ఏమీ లేదని అభిమానులు పెదవి విరిచారు. ఫలితంగా ‘రాధేశ్యామ్’ అపజయాన్ని మూటగట్టుకుంది.
లైగర్ పంచ్ మిస్
ఈ ఏడాది ఇండస్ట్రీ చవిచూసిన భారీ పరాజయాల్లో ‘లైగర్’ ఒకటి. దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ అనగానే ముహూర్తం షాట్తోనే అంచనాలు మొదలయ్యాయి. ‘పోకిరి’ రికార్డులు చెరిగిపోతాయని అనుకున్నారు. పైగా కిక్ బాక్సింగ్ నేపథ్యంలో కథ కావడంతో తిరుగులేదని భావించారు. ప్రపంచస్థాయి బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ నటించడం మరో ఘనతగా భావించారు. అందుకు తగ్గట్టే చిత్ర బృందం కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం చేసింది. అయితే, సినిమా విడుదల తర్వాత ఫలితం తారుమారు అయ్యింది. పూరి కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్గా ఈ చిత్రం మిగిలిపోయింది. విజయ్ దేవరకొండకు కూడా చేదు జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఓటీటీలోనూ ఈ సినిమా ఆశించిన స్థాయిలో స్ట్రీమింగ్ కాకపోవడం గమనార్హం.
ఇవీ అంతంత మాత్రమే..
ఈ ఏడాది భారీ ఫెయిల్యూర్స్లో ఒకటి మోహన్బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’. ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రాకపోవడంతో ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ జాబితాలో చేరింది. గోపీచంద్ హీరోగా నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా కమర్షియల్గా భారీ నష్టాన్ని చవి చూసింది. డ్రామా ఎక్కువ కావడమే ఈ చిత్రం పరాజయానికి కారణం అని విశ్లేషకుల మాట! వరుణ్తేజ్ నటించిన ‘గని’, నాగచైతన్య ‘థాంక్యూ’, సత్యదేవ్ ‘గాడ్సే’, రామ్ ‘ద వారియర్’ తదితర సినిమాలూ పెద్ద అంచనాల మధ్య విడుదలై ఫెయిల్యూర్స్గా మిగిలిపోయినవే! శర్వానంద్ హీరోగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, నాని కథానాయకుడిగా చేసిన ‘అంటే.. సుందరానికీ!’ సినిమాలు మొదట్లో మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకున్నా.. చివరికి పరాజయం మూటగట్టుకున్నాయి. కథల ఎంపికలో మరింత జాగ్రత్తపడాలని, ఇతివృత్తాల విషయంలో కొత్తదనానికి ప్రాధాన్యం ఇవ్వాలని.. సినిమా పరిశ్రమకు ఈ ఏడాది గట్టి హెచ్చరికే చేసింది.