Trivikram | త్రివిక్రమ్.. ఓన్లీ ఫర్ ఫ్యూ హీరోస్ అనే బోర్డ్ ఉంటుంది టాలీవుడ్లో ఎప్పుడూ. తన సేఫ్ జోన్ అనుకుంటాడో ఏమో కానీ అందులోంచి బయటికి రావడానికి అంతగా ఇష్టపడడు గురూజీ. తన కోసం చాలా మంది హీరోలు వేచి చూస్తున్నా కూడా మాటల మాంత్రికుడు మాత్రం తన మాయ కేవలం కొందరు హీరోలతోనే చేస్తుంటాడు. దర్శకుడిగా మారి 20 ఏళ్లవుతున్నా.. ఈయన పని చేసిన హీరోలు అరడజన్ కూడా దాటలేదు. ఒక్కో హీరోతోనే మూడు నాలుగు సినిమాలు చేస్తుంటాడు. తాజాగా మరోసారి అదే చేస్తున్నాడు ఈయన. ఇప్పుడు మహేశ్ బాబుతో పని చేస్తున్నాడు. ఈ కాంబినేషన్లో మూడో సినిమా ఇది. దీనికంటే ముందు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్తోనూ మూడు సినిమాలు చేశాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్, నితిన్, తరుణ్తో ఒక్కో సినిమా చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి హీరోలను రిపీట్ చేస్తున్నాడు గురూజీ. గుంటూరు కారం తర్వాత ఆల్రెడీ అల్లు అర్జున్తో సినిమాను ప్రకటించాడు కూడా. ఈ సారి పాన్ ఇండియన్ రేంజ్లో భారీగానే ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. పైగా అది మైథాలజీ అనే టాక్ కూడా వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మరోసారి భారీ గ్యాప్ తీసుకున్నాడు ఈయన. ఇప్పటికే ఈ చిత్రం వచ్చి మూడేళ్లు దాటిపోయింది. 2024 సంక్రాంతికి గుంటూరు కారం వస్తుంది. అంటే నాలుగేళ్ళ గ్యాప్ అన్నమాట. ఇదిలా ఉంటే గుంటూరు కారం తర్వాత బన్నీతోనే సినిమా అనుకున్నా.. ఇప్పుడు అది మారేలా కనిపిస్తుంది. నిజానికి గుంటూరు కారం 2023లోనే రావాల్సిన సినిమా. కాకపోతే కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్టు.. ఈ సినిమా మొదలు పెట్టిన తర్వాత చాలా జరిగాయి. ముందు ఎన్టీఆర్తో అనుకున్న సినిమా కాస్తా ఆగిపోవడం.. ఆ తర్వాత అనుకోకుండా మహేశ్ సినిమా వర్కవుట్ అవ్వడం.. షూటింగ్ మొదలైన తర్వాత మహేశ్ బాబు అమ్మా నాన్నలు చనిపోవడంతో గుంటూరు కారం ఆలస్యం అవుతూనే వచ్చింది. చివరికి ఎలాగోలా చివరి మూడు నెలల నుంచి నాన్ స్టాప్ షూటింగ్తో చివరి దశకు తీసుకొచ్చాడు గురూజీ. మరో నెల రోజుల్లో మాస్ యాక్షన్ చూడబోతున్నాం. దీని తర్వాత అల్లు అర్జున్ సినిమా కోసం రెడీ అవుతున్నారు ఫ్యాన్స్ కూడా. కానీ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్న బన్నీ.. మరో 8 నెలలు దానికే టైమ్ ఇవ్వనున్నాడు.
ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల కానుంది. అంటే బన్నీ కోసం త్రివిక్రమ్ కనీసం ఆర్నెళ్లకు పైగానే వేచి చూడాల్సి వస్తుంది. అందుకే ఈ గ్యాప్లో మరో సినిమా చేయాలనుకుంటున్నాడు. చాలా రోజులుగా నానితో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. కానీ వర్కవుట్ అవ్వడం లేదు. ఈయన ఫ్రీగా ఉన్నపుడు.. నాని బిజీగా ఉంటాడు.. నాని ఫ్రీగా ఉన్నపుడు త్రివిక్రమ్ బిజీగా ఉంటాడు.. అలా ప్రాజెక్ట్ కుదర్లేదు. ఇప్పుడు ఇద్దరూ ఫ్రీగానే ఉండబోతున్నారు. నాని ప్రస్తుతం నటిస్తున్న సరిపోదా శనివారం షూటింగ్ మార్చి నాటికి పూర్తి కానుంది. త్రివిక్రమ్తో సినిమా అంటే కచ్చితంగా నెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ ఉన్నా పక్కన బెట్టేస్తాడు నాని. అందుకే గుంటూరు కారం తర్వాత గురూజీ, నాని కాంబినేషన్ ఆన్ అయ్యేలా కనిపిస్తుంది. గతంలో నితిన్తో ఇలాగే అ.. ఆ సినిమాతో బ్లాక్బస్టర్ ఇచ్చాడు త్రివిక్రమ్. ఇప్పుడు నానితోనూ అలాంటి సాఫ్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ ఇది కుదిరితే మాత్రం నాని కెరీర్ మరో మెట్టు ఎక్కినట్లే.