కరోనా లాక్డౌన్ సమయంలో ఓటీటీలు సరికొత్త వినోద వేదికలుగా మారాయి. వివిధ భాషల్లో అగ్ర హీరోల చిత్రాలు కూడా ఓటీటీ మాధ్యమాల ద్వారా విడుదలకావడంతో భవిష్యత్తులో అవి థియేటర్కు ప్రత్యామ్నాయంగా అవతరించబోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ ఏడాది విజయాల్ని పరిశీలిస్తే థియేటర్ పునర్వైభవాన్ని సాధించిందనే విషయం ప్రస్ఫుటమవుతున్నది. పాన్ ఇండియా స్థాయి సినిమాలు మొదలుకొని చిన్న హీరోల చిత్రాలు కూడా థియేటర్స్లో విజయకేతనం ఎగరేశాయి. మరోవైపు ఓటీటీ బిజినెస్ గతంలో పోల్చితే నెమ్మదించింది. అంతిమంగా ప్రేక్షకులు కంటెంట్కే అగ్రపీఠం వేస్తారని, సంప్రదాయ వినోద వేదిక థియేటర్కు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందని ఈ ఏడాది సినిమా విజయాలు నిరూపించాయి.
లాక్డౌన్ సమయంలో ఓటీటీలు సామాన్య ప్రజలకు బాగా చేరువయ్యాయి. ప్రాంతీయ చిత్రాలతో పాటు గ్లోబల్ మూవీస్, సిరీస్లు విరివిగా అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఓటీటీల వైపుకు మళ్లారు. ఇంటిల్లిపాదికి చవకైన వినోద వేదికలుగా ఓటీటీలు మారాయి. ‘వి’ ‘నిశ్శబ్దం’ ‘నారప్ప’ ‘దృశ్యం-2’ వంటి చిత్రాలు కూడా నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. అప్పుడున్న కరోనా భయాందోళనలు, భవిష్యత్తు సినిమా బిజినెస్ ఎలా ఉంటుందో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో అగ్ర నిర్మాతలు కూడా ఓటీటీ రిలీజ్లపైనే దృష్టిపెట్టారు. అదే సమయంలో డిజిటల్ సంస్థలు భారీ మొత్తాలు చెల్లించి సినిమాల్ని కొనుగోలు చేయడానికి పోటీపడ్డాయి. మొత్తంగా 2020-21 నడుమ ఓటీటీలు థియేటర్ మీద పైచేయి సాధించి ప్రత్యామ్నాయ వినోద వేదికలుగా మారాయి.
ప్రభావం చూపని టికెట్ రేట్ల పెంపు
ఈ ఏడాది టికెట్ రేట్ల పెంపు నిర్ణయంతో థియేటర్ల మనుగడ ఏమిటన్నది మరోసారి చర్చకు వచ్చింది. ఓవైపు ఓటీటీలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపు వల్ల సామాన్య ప్రేక్షకులు ఇక థియేటర్లకు రావడం కష్టమనే మాటలు వినిపించాయి. మల్టీఫ్లెక్స్లు మొదలుకొని సింగిల్ స్క్రీన్ థియేటర్ల వరకు టికెట్ రేట్ల పెంపుకు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. అయితే ఈ నిర్ణయం బాక్సాఫీస్ను ఏమాత్రం ప్రభావితం చేయలేపోయింది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 వంటి పాన్ ఇండియా సినిమాలు భారీ వసూళ్లతో సత్తా చాటాయి.
విజువల్ గ్రాండియర్తో పాటు కథాంశం తాలూకు ఎమోషనల్ ఫీల్ను ఆస్వాదించాలంటే పెద్ద తెరను మించిన వేదిక లేదని ప్రేక్షకులు భావించారు. దీంతో థియేటర్లన్నీ కళకళలాడాయి. ఇటీవల విడుదలై హాలీవుడ్ చిత్రం ‘అవతార్-2’ టికెట్లను హైదరాబాద్, బెంగళూరు, ముంబయి వంటి కేంద్రాల్లో వెయ్యి నుంచి రెండు వేల మధ్య విక్రయించారు. ‘అవతార్’ ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజ్, విజువల్ ఎఫెక్ట్స్పై ఉన్న ఆసక్తి వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి ప్రేక్షకులు థియేటర్లలో ఆ సినిమాను వీక్షించారు. దీంతో టికెట్ రేట్లతో సంబంధం లేకుండా తమకు నచ్చిన సినిమాల్ని చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకే వస్తారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మళ్లీ థియేటర్కే అగ్రతాంబూలం
ఈ ఏడాది ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 వంటి పాన్ ఇండియా చిత్రాలతో పాటు బింబిసార, సీతారామం, మేజర్, డీజే టిల్లు, కార్తికేయ-2, విక్రమ్, కాంతార వంటి చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇటీవల విడుదలైన మసూద, ధమాకా, 18పేజీస్ చిత్రాలకు కూడా మంచి ఆదరణ దక్కింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత థియేటర్లు హౌస్ఫుల్ బోర్డ్లతో కనిపించాయి. ముఖ్యంగా సీతారామం, మేజర్, కార్తికేయ-2 విజయాలు జాతీయస్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటాయి. మంచి కథల్ని ప్రేక్షకుల్ని ఎప్పుడూ ఆదరిస్తారని, థియేటర్ల వైపుకు ప్రేక్షకుల అడుగులు పడాలంటే కొత్త కంటెంట్పై దర్శకనిర్మాతలు దృష్టిపెట్టాలనే అవశ్యకతను చాటిచెప్పాయి.
నిరాశపర్చిన స్ట్రెయిట్ ఓటీటీ చిత్రాలుఈ ఏడాది దక్షిణాది నుంచి కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ‘మహాన్’, ప్రిమమణి ‘భామా కలాపం’, కీర్తి సురేష్ ‘సాని కాయిదమ్’, సుమంత్ ‘మళ్లీ మొదలైంది’ మమ్ముట్టి సైకలాజికల్ థ్రిల్లర్ ‘పుజు’, నివేధా పేతురాజ్ ‘బ్లడీ మేరీ’, నయనతార ‘ఓ2’ వంటి చిత్రాలు ఓటీటీలో నేరుగా విడుదలకాగా..వాటిలో చాలా సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఓటీటీ సక్సెస్ను నిర్ణయించడానికి ఎలాంటి ప్రామాణిక నియమాలు లేకపోవడం కూడా పెద్ద అవరోధంగా మారింది. థియేటర్ రిలీజ్ విషయంలో వసూళ్ల ప్రాదిపదికగా సినిమా విజయాన్ని నిర్ణయిస్తారు. అయితే ఓటీటీ రెవిన్యూ షేరింగ్ సంక్లిష్టమైన మోడల్గా కనిపిస్తుంది. వ్యూయర్షిప్ మీద సినిమా సక్సెస్ను నిర్ణయించే అంశంలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. దీంతో ఓటీటీ వేదికల మీద సినిమా ఏ మేరకు ఆదరణ పొందిందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతున్నది.
మారిన ఓటీటీ రూల్స్
గతంలో మాదిరిగా ఓటీటీల కోసం ఇబ్బడిముబ్బడిగా సినిమాల్ని నిర్మించే పరిస్థితి కనిపించడం లేదు. సినిమాల కొనుగోలు విషయంలో ఓటీటీ సంస్థలు కఠినమైన రూల్స్తో ముందుకొస్తున్నాయి. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్కు ససేమిరా అంటున్నాయి. తొలుత సినిమాను కనీస థియేటర్లలో విడుదల చేయాలని, ప్రేక్షకుల ఆదరణను బట్టి ఓటీటీ రేటు నిర్ణయిస్తామని చెబుతున్నాయి. ఈ కారణంగా కేవలం ఓటీటీలను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయడం అంత శ్రేయస్కరం కాదని అంటున్నారు. ఓటీటీ సినిమాల విషయంలో నిర్మాతల మండలి మార్గదర్శకాల్ని ఎవరూ పాటిస్తున్నట్లు కనిపించడం లేదు.
థియేట్రికల్, ఓటీటీ రిలీజ్ మధ్య రెండు నెలల వ్యవధి ఉండాలనే రూల్ అమలు కావడం లేదని అంటున్నారు. కొన్ని సినిమాల విషయంలో ముందస్తు ఒప్పందాలు జరిగిపోవడం, ఓటీటీ రిలీజ్ అంశంలో నిర్మాతలు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడంతో ప్రొడ్యూసర్ కౌన్సిల్ రూల్స్ అమలు కావడం లేదని తెలుస్తున్నది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ బిజినెస్ గతంలో మాదిరిగా అంత సులభం కాదని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ థియేటర్ వ్యవస్థ పునరుజ్జీవనానికి బాటలు వేస్తాయని, తిరిగి థియేటర్ పూర్వవైభవం సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.