విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం విజయ్ దేవరకొండ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్రంలోని ‘నా రోజా నువ్వే..నా దిల్సే నువ్వే” అనే ఫస్ట్ లిరికల్ సాంగ్తో పాటు కొత్త పోస్టర్ను కూడా విడుదల చేశారు.
‘నా రోజా నువ్వే, నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే, నా కడలి కెరటంలో ఓ మౌనరాగం నువ్వేలే..’ అంటూ ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాల పేర్లను గుర్తుకుతెస్తూ ఈ పాట సాగింది. స్వరకర్త హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ పాటను స్వయంగా ఆలపించారు. దర్శకుడు శివ నిర్వాణ నృత్యరీతుల్ని సమకూర్చిన ఈ గీతాన్ని కశ్మీర్లోని సుందరమైన లొకేషన్లలో తెరకెక్కించారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీశర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.మురళి, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: శివ నిర్వాణ.