బాలీవుడ్ తార పరిణీతి చోప్రా తొలిసారి నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోడ్ నేమ్ తిరంగా’. ఈ చిత్రంలో ఆమె ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) ఏజెంట్ దుర్గా సింగ్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు రిభు దాస్గుప్తా రూపొందించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. 2001 పార్లమెంట్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మన గూఢచార ఎజెంట్ ఎలా అంతం చేసిందనేది ఈ చిత్రంలో చూపించారు. ఆ ప్రమాదకర మిషన్లో ఏజెంట్ దుర్గా సింగ్ చేసిన సాహసాలు ఆకట్టుకుంటాయని చిత్రబృందం చెబుతున్నది. ఈ సినిమాలో నటించిన అనుభవాలను తాజాగా పరిణీతి చోప్రా వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ…‘ఈ సినిమా షూటింగ్ కోసం మేము టర్కీ వెళ్లాం. అక్కడికి వెళ్లిన మూడు రోజులకు మన దేశంలో లాక్డౌన్ విధించారు. ఎవరూ ఊహించని పరిస్థితులు ప్రపంచమంతా ఏర్పడ్డాయి. యూనిట్ అంతా విదేశంలో ఉన్నాం. రేపు షూటింగ్ జరుగుతుందో లేదో తెలియదు. తొలిసారి యాక్షన్ మూవీ చేస్తున్నా కాబట్టి ఉత్సాహంగానే ఉన్నాను. రోజుకో చాలెంజ్ ఎదురైంది. దర్శక నిర్మాతలు ధైర్యంగా నిలబడి సినిమాను పూర్తి చేశారు’ అని చెప్పింది.