Tiger Nageswara Rao Movie | సాధారణంగా రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ తారల బయోపిక్స్ తెరపైకి వస్తాయి. కానీ ఓ దొంగ జీవితాధారంగా సినిమా రూపొందించడం, ఆ పాత్రని మాస్ మహారాజా రవితేజ లాంటి హీరో పోషించడంతో కొంత ఆసక్తిని పెంచింది. 1980ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. మరి ఈ దొంగ కథ ప్రేక్షకుల మనసులని దోచుకుందా? లేదా తెలియాంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.
కథ గురించి:
1980 నేపధ్యంలో ఈ కథ సాగుతుంది. స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ నాగేశ్వరరావు అలియాస్ టైగర్ నాగేశ్వరరావు (రవితేజ). నాగేశ్వరరావు మామూలు దొంగ కాదు. ఏదైనా దొంగతనం చేసే ముందు దాని గురించి ముందే సమాచారం ఇస్తాడు. ఒక సందర్భంలో ఏకంగా దేశ ప్రధాని కార్యాలయానికి ఓ బెదిరింపు లేఖ పంపుతాడు. దీంతో ప్రధాని రక్షణదళం అలెర్ట్ అవుతుంది. గతంలో టైగర్ జోన్ లో పని చేసిన పోలీసు అధికారి మురళీ శర్మని ఢిల్లీకి రప్పించి టైగర్ గురించి వివరాలు అడుగుతారు. తర్వాత ఏం జరిగింది ? మురళీశర్మ టైగర్ గురించి ఎలాంటి నిజాలు చెప్పాడు? అసలు టైగర్ ప్రధాని కార్యాలయానికి బెదిరింపు లేఖ పండడానికి కారణం ఏమిటి ? ఇవన్నీ తెరపై చూడాలి.
కథా విశ్లేషణ:
స్టూవర్టుపురం నాగేశ్వరరావు గురించి కొంత సమాచారం ప్రజల్లో వుంది. స్టూవర్టుపురం దొంగతానాలకు ప్రసిద్ధి అని చిత్రీకరిస్తూ గతంలో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడు దర్శకుడు వంశీ స్టూవర్టుపురం, దానికి కేంద్ర బిందువైన నాగేశ్వరరావు జీవితాన్ని పాన్ ఇండియా లెవల్ చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ప్రధాని కార్యాలయం, గోదావరి బ్రిడ్జ్ నేపధ్యంలో రైలు దోపిడీ సన్నివేశాలతో ఆసక్తికరంగానే కథని మొదలుపెట్టిన దర్శకుడు ఆ ఆసక్తిని కొనసాగించలేకపోయాడు. ఈ బయోపిక్ జోడించిన టైగర్ ప్రేమకథ రక్తికట్టలేదు. అది కాస్త రొటీన్ గా మారింది. ఆ ప్రేమకథతో వచ్చిన ఎమోషన్ కూడా పాతగానే వుంటుంది. అయితే విరామాని ముందు వచ్చే పోర్ట్ సీక్వెన్స్ తో పాటు ప్రధాని లేఖ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ పై కాస్త అంచనాలు పెంచుతాయి.
అయితే సెకండ్ హాఫ్ లో అనూహ్యంగా టైగర్ గ్రాఫ్ మారిపోతుంది. ఒక్కసారిగా రాబిన్ వుడ్ తరహా పాత్రకు షిఫ్ట్ అవుతుంది. అయితే ఈ మార్పు సహజంగా వుండదు. ప్రేక్షకులు సరిగ్గా రిజిస్టర్ చేయకుండానే హడావిడిగా చదువు. ఫ్యాక్టరీ, ఉద్యోగాలు.. ఇలా సన్నివేశాలు వచ్చిపడతాయి. సెకండ్ హాఫ్ అంతా ఫ్యాక్టరీ లక్ష్యంగా టైగర్ పాత్ర ముందుకు కదులుతుంది. అయితే ఆ ప్రయాణం కాస్త సాగదీతగా ఉంటుంది. ఇక గాయత్రి భరద్వాజ్ రూపంలో యాడ్ అయిన ఫ్యామిలీ ట్రాక్ కూడా రొటీన్ గా వుంటుంది. బయోపిక్ అన్నప్పుడు దానికో ఒరిజినల్ టోన్ వుంటుంది. కానీ టైగర్ సన్నివేశాలని చూస్తున్నపుడు ఏవో పాత సినిమాల దృశ్యాలు చూస్తున్నట్లుగానే వుంటుంది. పైగా క్లైమాక్స్ కూడా చాలా సుధీర్గంగా సాగడం, టైగర్ కి ఎన్నో బుల్లెట్లు తగిలిన తర్వాత కూడా ఆ పాత్ర డైలాగులు చెబుతూ వుండటం కొంచెం లాజిక్ దూరంగా వుంటుంది.
నటీనటులు నటన:
టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ అభినయం బావుంది. ఆ పాత్రకు తన మాస్ ఎనర్జీ జోడించారు. యాక్షన్ సన్నివేశాలని చాలా చక్కగా చేశారు. తన పాత్ర వరకూ న్యాయం చేశారు. నూపూర్, గాయత్రి నటన డీసెంట్ గా వుంటుంది. అనుపమ్ ఖేర్, నాజర్ తమ అనుభవం చూపించారు. విలన్ యలమంద పాత్రలో చేసిన హరీష్, జీషు క్రూరమైన పాత్రల్లో కనిపించారు. హేమలతా లవణంగా కనిపించిన రేణు దేశాయ్ ఆ పాత్రని హుందాగా చేశారు. మురళీశర్మతో పాటు మిగతా నటీనటులు పరిధిమేర నటించారు.
టెక్నికల్:
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలు గుర్తుండవు కానీ నేపధ్య సంగీతం మాత్రం బావుంది. తొలిసగంలో చాలా ఎనర్జీ నింపారు. అయితే సెకండ్ హాఫ్ లో సన్నివేశాలు డల్ కావడంతో ఆయన జోష్ కూడా తగ్గినట్లే అనిపిస్తుంది. కెమారపనితనం బావుంది. వింటేజ్ విజువల్స్ ని బాగానే చూపించారు. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా వుండాల్సింది. నిర్మాణ విలువలు బావున్నాయి.
+ప్లస్ పాయింట్స్
రవితేజ
కొన్ని యాక్షన్ సన్నివేశాలు
నిర్మాణ విలువలు
-మైనస్ పాయింట్స్
లవ్ ట్రాక్, సెకండ్ హాఫ్
కథనంలో ఆసక్తి, వేగం లేకపోవడం
శ్రుతిమించిన హింస
రేటింగ్ : 2.5/5