‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ద్వారా అగ్రహీరోలు ఎన్టీఆర్, రామ్చరణ్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డును సాధించడంతో పాటు ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆస్కార్ పురస్కారాలకు సమయం దగ్గర పడుతుండటంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం అమెరికాలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజెంటర్గా ఆహ్వానం అందుకున్న హీరో రామ్చరణ్ అమెరికా చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన అమెరికాలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ ‘రాజమౌళి సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళిని మేమంతా ఇండియన్ స్పీల్బర్గ్ అని పిలుచుకుంటాం. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆదరణ ఎంతో సంతోషాన్నిస్తున్నది. అది భారతీయ సినిమాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రాజమౌళి తన తదుపరి సినిమాతో గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెడతాడు’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన తొలి తెలుగు నటుడు రామ్చరణ్ కావడం విశేషం. గతంలో భారత్ నుంచి ప్రియాంకచోప్రా, షారుఖ్ఖాన్ ఈ టాక్షోలో పాల్గొన్నారు.