త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన సినిమా ‘ప్రేమ దేశం’. నటి మధుబాల కీలక పాత్రను పోషించింది. ఈ చిత్రాన్ని శ్రీ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శిరీష సిద్ధం నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ సిద్ధం దర్శకుడు. డిసెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలపై మధుబాల మాట్లాడుతూ…‘ఈ చిత్రంలో హీరోకు తల్లి పాత్రలో నటించాను. కొడుకుతో ఒక ఫ్రెండ్లాగా ఉంటాను. హీరోయిన్ ముందు నాకు పరిచయమై నచ్చుతుంది. ఇలాంటి అమ్మాయిని మన ఇంటికి కోడలిగా తీసుకురమ్మని చెబుతాను. నా పాత్ర సరదాగా సాగుతూ వినోదాన్ని అందిస్తుంది. సినిమాలో వచ్చే మొదటి సన్నివేశం అరుణ్ అదిత్ నాకు మధ్య వస్తుంది.
ఈ పాత్రలో అతను ఆకట్టుకునేలా నటించాడు. ప్రేయసిగా తెరపై కనిపించడానికి కావాల్సిన లక్షణాలు మేఘా ఆకాష్లో ఉన్నాయి. తను చాలా మంచి అమ్మాయి. హీరోయిన్గా నటించేప్పుడు నేను ఏ ఒక్క ఇండస్ట్రీకి పరిమితం కాలేదు. తెలుగు, తమిళం, హిందీ..ఇలా పలు భాషల్లో నటిస్తూ వచ్చాను. అందువల్ల ఏ ఇండస్ట్రీలోనూ ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. దాని వల్ల నాకు పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు దక్కింది. ‘రోజా’, ‘జెంటిల్మెన్’, ‘అల్లరి ప్రియుడు’ నాకు తెలుగులో బాగా గుర్తింపు తెచ్చాయి. ‘రోజా’ సినిమాలో ‘చిన్ని చిన్ని ఆశ’ పాటను ఇప్పటికీ పిల్లలు స్కూల్ ప్రోగ్రామ్స్లో పాడుకుంటారు. డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదు. అన్ని తరహాల పాత్రల్లో నటించాలని ఉంది. ప్రస్తుతం హిందీలో ‘కర్తమ్ హుక్తమ్’, తెలుగులో కొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను’ అని చెప్పింది.