Bigg Boss | బిగ్ బాస్ షోకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ షో సీజన్ 7 ముగిసిన అనంతరం జరిగిన దాడి ఘటనపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో సరూర్ నగర్కు చెందిన అవినాష్ రెడ్డి, యూసఫ్ గూడాకు చెందిన సుధాకర్, పవన్లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. ఇక ఈ కేసులో ఇప్పటివరకు 24 మందిని నిందితులుగా జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు .
మరోవైపు ఈ కేసులో బిగ్బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్కు (Pallavi Prashanth) నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రశాంత్కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల ముందు విచారణకు ఆదివారం హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అలాగే.. రూ.15 వేల చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు తెలిపింది.
బిగ్బాస్ (Bigg Boss) ఫైనల్ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ధ్వంసం, దాడి ఘటనలో ప్రశాంత్తోపాటు అతని సోదరుడు మహావీర్ను (Mahaveer) పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరినీ జూబ్లీహిల్స్ పోలీసులు చంచల్గూడ జైలుకు (Chanchalguda Jail) తరలించారు.