Allari Naresh | సినిమాల్లో పోటీ అనేది సాధారణ విషయమే. ప్రతి వారం రెండు,మూడు సినిమాలు పోటీ పడుతూనే ఉంటాయి. అయితే ఈ వారం మాత్రం రెండు డబ్బింగ్ సినిమాలతో తెలుగు సినిమా పోటీ పడుతుంది. ఇందులో మరో విశేషం ఏంటంటే ఈ రెండు డబ్బింగ్ సినిమాలకు టాలీవుడ్లోని అగ్ర నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు స్ట్రేయిట్ సినిమాకు ఏ స్థాయిలో బజ్ ఉందో.. డబ్బింగ్ సినిమాలకు కూడా అదే స్థాయిలో బజ్ ఉంది. మరి ఆ రెండు డబ్బింగ్ సినిమాలతో పోటీ పడనున్న తెలుగు సినిమా ఏంటో చూద్దాం.
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం:
కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్గా పేరు సంపాదించుకున్న అల్లరి నరేష్కు గత కొంత కాలంగా హిట్లు లేవు. ముఖ్యంగా జబర్థస్త్ వంటి కామెడీ షోలు రావడంతో అల్లరి నరేష్ సినిమాలకు ప్రేక్షకుల్లో అధరణ తక్కువైంది. దాంతో నరేష్ తనని తాను కొత్తగా ఆవిష్కరిస్తూ ‘నాంది’తో సెకండ్ ఇన్నింగ్స్కు నాంది పలికాడు. గతేడాది రిలీజైన ఈ చిత్రం నరేష్ కెరీర్లో బిగెస్ట్ హిట్గా నిలిచింది. చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి సీరియస్ పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ప్రస్తుతం అదే తరహాలో మరో సీరియస్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఏ. ఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నరేష్ ఎలక్షన్ అధికారిగా కనిపించనున్నాడు. అడవి ప్రాంతంలో ఉండే ఓ ఊరికి అల్లరి నరేష్ ఎలక్షన్ అధికారిగా వెళ్తాడు. అయితే అక్కడి ప్రజలను, రాజకీయ నాయకులు ఓట్లు గానే చూస్తుంటారు. కనీస అవసరాలకు కూడా ఏ విధమైన సహాయం చేయరు. దాంతో నరేష్ ఆ ఊరు ప్రజలతో కలిసి రాజకీయ నాయకులలో ఏ విధంగా మార్పు తెచ్చాడు అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా పోస్టర్ నుండి ట్రైలర్ వరకు ప్రతీది ప్రేక్షకులో మంచి బజ్ క్రియేట్ చేశాయి. పైగా నాంది వంటి బ్లాక్బస్టర్ తర్వాత నరేష్, మరో సామాజిక అంశంతో రానుండటంతో ప్రేక్షకులలో భారీగానే అంచనాలు నెలకొన్నాయి.
ఆ రెండు డబ్బింగ్ సినిమాలు ఏంటంటే?
భేదియా:
వరుణ్ ధావన్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భేదియా’. అమర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 25న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ట్రైలర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. తోడేలు కాటుకు గురి కావడంతో వరుణ్ ధావన్ తోడేలులాగా మారిపోతాడు. తోడేలులా మారిన తర్వాత వరుణ్ జీవితం ఎలా మారింది అనే కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగులో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నాడు. కాంతార వంటి బ్లాక్బస్టర్ తర్వాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడంతో ఈ సినిమాపై తెలుగులో కూడా మంచి బజ్ ఏర్పడింది.
లవ్టుడే:
ఈ మధ్య కాలంలో భాషతో సంబంధంలేకుండా కథ, కథనం కొత్తగా ఉంటే చాలు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో తమిళంలో బ్లాక్బస్టర్ వసూళ్ళతో దూసుకుపోతున్న ‘లవ్టుడే’ సినిమాను తెలుగులో దిల్రాజు రిలీజ్ చేస్తున్నాడు. ప్రదీప్ రంగనాథన్ నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో నవంబర్ 4న రిలీజై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. నేటి సమాజంలో లవ్ అనేది ఎలా ఉంది అనే కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకు తమిళ ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో దిల్రాజు ఈ సినిమాను తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నాడు. ఇటీవలే రిలీజైన ట్రైలర్కు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
ఇక ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో పాటుగా ఈ రెండు సినిమాలపై కూడా విపరీతమైన బజ్ ఉంది. మరీ ఈ వారం విన్నర్గా ఏ చిత్రం నిలుస్తుందో చూడాలి.