త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) లేనిదే భీమ్లా నాయక్ (Bheemla Nayak)సినిమా లేదు..ఈ మాట అన్నది ఎవరని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్న మాటలివి. అయితే ఏ సినిమా ఫంక్షన్కు హాజరైనా తన స్పీచ్తో అభిమానులు, మూవీ లవర్స్ లో జోష్ నింపుతుంటాడు మాటల మాంత్రికుడు. మరి అన్నీ తానై ముందుకు నడిపించి సినిమాను గ్రాండ్ లెవల్లో ప్రమోట్ చేసే ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇపుడు టాలీవుడ్లో ఇదే హాట్ టాపిక్గా మారింది.
భీమ్లా నాయక్ మొదలైనప్పటి నుంచి కొందమంది ప్రేక్షకులు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రిప్ట్ రైటర్ అయినప్పటికీ, ఈ చిత్రానికి దర్శకుడి టోపీ కూడా పెట్టేసుకున్నాడంటూ కామెంట్లు చేశారు. అయితే తనపై వస్తున్న కామెంట్లకు పుల్ స్టాప్ పెట్టేందుకు స్టేజీపై తాను కనిపించకుండా..భీమ్లానాయక్ క్రెడిట్ అంతా సాగర్ కే చంద్రకే ఇచ్చేలా ప్లాన్ చేసుకున్నాడని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిర్మాత బండ్ల గణేశ్ ఓ లీక్డ్ ఆడియో కాల్ డైరెక్టర్ త్రివిక్రమ్ను డిస్టర్బ్ చేసిందని, అందుకే త్రివిక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు మరో పుకారు కూడా ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. మొత్తానికి కారణాలేమైనా తమ అభిమాన దర్శకుడు ఇలా పవన్ కల్యాణ్ సినిమాకు స్పీచ్ ఇవ్వకపోయే సరికి నిరాశలో మునిగిపోయారు. మరి స్పీచ్ ఇవ్వకపోవడంపై త్రివిక్రమ్ ఎలా స్పందించాడో చూడాలి.