ఇటీవల కన్నుమూసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు సంతాప సభను తెలుగు చిత్ర పరిశ్రమ మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, శివాజీ రాజా, నిర్మాతలు సి కళ్యాణ్, ఆది శేషగిరిరావు, రమేష్ ప్రసాద్, రచయిత విజయేంద్ర ప్రసాద్, ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కృష్ణంరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ‘చిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడిని, నిర్మాతను కోల్పోయింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలి’ అని మోహన్ బాబు అన్నారు. ‘కృష్ణంరాజు నట ప్రయాణం మొత్తం సాహసోపేతంగా సాగింది. ఏ కష్టం వచ్చినా వెరవని వ్యక్తిత్వం ఆయనది. అజాతశత్రువుగా అందరి ప్రేమను పొందారు’ అని నిర్మాత ఆదిశేషగిరి రావు అన్నారు. భౌతికంగా కృష్ణంరాజు మనకు దూరమైనా మనసులో చిరకాలం ఉంటారని కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పేర్కొన్నారు.