దివంగత అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ టాలీవుడ్ అరంగేట్రంపై చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. తన తల్లి శ్రీదేవికి తెలుగు సినీరంగంతో ఉన్న అనుబంధం దృష్ట్యా..తెలుగు సినిమాలపై ఎంతో మక్కువ ప్రదర్శిస్తుంటుంది జాన్వీకపూర్. తాజా సమాచారం ప్రకారం ఈ భామ తెలుగు అరంగేట్రానికి రంగం సిద్ధమైందని తెలిసింది.
వివరాల్లోకి వెళితే…ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. జూలైలో సెట్స్మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయిక కోసం అన్వేషణ జరుగుతున్నది. రష్మిక మందన్న, అనన్యపాండే, అలియాభట్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా జాన్వీకపూర్ పేరు తెరపైకి వచ్చింది.
ఈ సినిమాలో జాన్వీకపూర్ నాయిక అయితేనే బాగుంటుందని చిత్రబృందం భావిస్తున్నదట. కథ నచ్చితే తన కుమార్తె తెలుగులో నటిస్తుందని జాన్వీకపూర్ తండ్రి బోనీ కపూర్ ఇటీవల చెప్పారు. దీంతో జాన్వీకపూర్ను ఒప్పించేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నదని సమాచారం. ఇప్పటికే జాన్వీతో సంప్రదింపులు పూర్తయ్యాయని, సినిమాలో నటించేందుకు ఆమె సుముఖంగా ఉందని తెలిసింది.
ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే అంటున్నారు. ‘ధడక్’ ‘గుంజన్ సక్సేనా’ వంటి చిత్రాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది జాన్వీకపూర్. దక్షిణాదిలో నటించేందుకు గత కొద్దిరోజులుగా ఈ భామ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని అంటున్నారు.