సంజన, మూలవిరాట్ అశోక్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘సాచి’. ఈ చిత్రాన్ని సత్యానంద్ స్టార్ మేకర్స్ సమర్పణలో విధాత ప్రొడక్షన్స్ పతాకంపై ఉపేన్ నడిపల్లి, వివేక్ పోతిగేని నిర్మిస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతున్నది. వివేక్ పోతిగేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్లో జరిగింది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..‘తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దర్శక నిర్మాత వివేక్ పోతిగేని అమెరికాలో స్థిరపడినా తండ్రి కోరిక మేరకు దర్శకుడు అవుతున్నారు.
ప్రజలను చైతన్యవంతం చేసే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నా’ అన్నారు. దర్శక నిర్మాత వివేక్ పోతిగేని మాట్లాడుతూ…‘తండ్రి అనారోగ్యానికి చికిత్స చేయించడం కోసం ఓ కూతురు చేసిన ప్రయత్నమే ఈ చిత్రానికి కథానేపథ్యం. భావోద్వేగాలతో కూడి ఉంటుంది’ అన్నారు.