గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి రూపొందించిన సినిమా ‘పక్కా కమర్షియల్’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా నాయికగా నటించగా..సత్యరాజ్, రావు రమేష్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. బన్నీ వాసు నిర్మాత. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతున్నదని చిత్రబృందం చెబుతున్నారు. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ..‘మేము చెప్పినట్లు సినిమా కమర్షియల్ అంశాలతో ఉందనే టాక్ వచ్చింది. ప్రతి షోకూ వసూళ్లు పెరుగుతున్నాయి. ఇలాంటి ఆఫ్ సీజన్లోనూ హాల్స్ నిండటం అరుదు. కుటుంబంతో కలిసి చూస్తున్నామని మెసేజ్లు పంపుతున్నారు. గోపీచంద్ను బాగా చూపించామని, రాశీ ఖన్నా క్యారెక్టర్ ఆకట్టుకుందని చెబుతున్నారు. మా కాంబినేషన్కు మరో విజయవంతమైన సినిమా దక్కింది. త్వరలోనే ఇంకా మంచి కథా కథనాలతో కొత్త సినిమాతో మీ ముందుకొస్తాం’ అన్నారు
. నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ..‘ప్రేక్షకులకు ఒక మంచి మాస్ సినిమా ఇవ్వాలనే మా ప్రయత్నం సఫలమైంది. ఫస్ట్ డే ఆరు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. గోపీచంద్ సినిమాల్లో బెస్ట్ ఓపెనింగ్స్ ఇవి. మారుతి సినిమా నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో ఆకట్టుకుంటున్నది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు సప్తగిరి, నిర్మాత ఎస్కేఎన్ తదితరులు పాల్గొన్నారు.