‘కథే ఈ సినిమాకు అసలైన హీరో. గొప్ప తెలుగు సినిమా ఇదని అన్ని భాషల వారు గర్వంగా చెప్పుకొనేలా ఉంటుంది’ అని అన్నారు శర్వానంద్. సిద్ధార్థ్తో కలిసి ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మహాసముద్రం’. అజయ్భూపతి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. అదితీరావ్హైదరీ, అను ఇమ్మాన్యుయెల్ కథానాయికలు. ఈ నెల 14న విడుదలకానుంది. శనివారం హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ ‘దర్శకుడు చెప్పిన కథ వినగానే ఫస్ట్ సిట్టింగ్లోనే ఒక్క మార్పు లేకుండా అంగీకరించా. తొమ్మిది మంది జీవితాలతో ముడిపడి సాగే ప్రేమకథా చిత్రమిది’ అని తెలిపారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాతో శర్వానంద్ రూపంలో మంచి స్నేహితుడు దొరికాడు. తెలుగు ప్రేక్షకులకు నాకు మధ్య ఏర్పడిన వెలితిని ఈ సినిమా పూరిస్తుంది’ అని చెప్పారు. అజయ్భూపతి ఎంతో ప్రేమించి చేసిన చిత్రమిదని నిర్మాత అనిల్ సుంకర పేర్కొన్నారు. ‘భావోద్వేగాలతో ముడిపడిన ప్రేమకథ ఇది. ఒకరి జీవితాలను మరొకరు ఎలా ప్రభావితం చేశారన్నది ఆకట్టుకుంటుంది. ఇమేజ్లు కాకుండా తెరపై పాత్రలు మాత్రమే కనిపిస్తాయి’ అని దర్శకుడు అజయ్భూపతి అన్నారు. ఇందులో తాను మహా అనే పాత్రను పోషించానని అదితీరావ్ హైదరీ చెప్పింది.