The Indrani Mukerjea Story | 2015లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్’ (The Indrani Mukerjea Story Buried Truth). ఈ డాక్యుమెంటరీని ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డాక్యుమెంటరీ ప్రసారం కాకుండా నిలిపివేయాలని స్పెషల్ కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. ఈ డాక్యుమెంటరీలో షీనా బోరా కేసులో నిందితులుగా ఉన్న వాళ్లు, నిందితులతో సంబంధం ఉన్న వాళ్లు నటించారని, కాబట్టి ఆ డాక్యుమెంటరీ ప్రసారం కాకుండా అడ్డుకోవాలని పిటిషన్లో పేర్కొంది.
అయితే ఈ డాక్యుమెంటరీ సిరీస్ను నెట్ఫ్లిక్స్లో ప్రసారం కాకుండా నిలిపివేయాలని అభ్యర్థిస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. డాక్యుమెంటరీ ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశించే అధికారం తమకు లేదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే దర్యాప్తు సంస్థతోపాటు న్యాయస్థానం వీక్షించేందుకు ముందస్తుగా ప్రదర్శించాలని సదరు ఓటీటీ సంస్థను కోర్టు ఆదేశించింది. ఇక ఈ డాక్యుమెంటరీపై దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీంతో తాజాగా నెట్ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రసారమవుతోంది.
Some questions will haunt you forever, and some secrets refuse to fade away. Watch The Indrani Mukerjea Story: Buried Truth, now streaming in English, Hindi, Tamil and Telugu only on Netflix. pic.twitter.com/O1dXKvQkaN
— Netflix India (@NetflixIndia) February 29, 2024
2015లో షీనాబోరా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కన్నతల్లే కూతుర్ని చంపేసిన వైనం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ఏప్రిల్, 2012 సంవత్సరంలో ఇంద్రాణి ముఖర్జియా తన డ్రైవర్ శ్యామ్వర్, మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలిసి.. తన మరో మాజీ భర్తతో కన్న 25 ఏళ్ల కూతురు షీనా బోరాను గొంతు నులిమి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. వేరే కేసులో అరెస్టయిన డ్రైవర్ శ్యామ్వర్ ద్వారా 2015లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దాంతో 2015లో ప్రధాని నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియాతోపాటు డ్రైవర్ శ్యామ్వర్, మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పటి నుంచి ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియాకు 2022లో బెయిల్ లభించింది. కేసులో ఇతర నిందితులు కూడా ప్రస్తుతం బెయిల్పై బయటే ఉన్నారు.