ప్రతి విషయంలో తాను సృజనాత్మకంగా ఆలోచిస్తానని, నిద్రలేచిన మరుక్షణం నుంచే జీవిత లక్ష్యాన్ని స్ఫురణకు తెచ్చుకొని శ్రమిస్తానని చెప్పింది అగ్ర కథానాయిక దీపికా పడుకోన్. ఇటీవలే ఈ భామ పారిస్లో జరిగిన ‘ది బిజినెస్ ఫ్యాషన్’ కార్యక్రమంలో పాల్గొంది. గత కొద్ది వారాలుగా ఆమె ఆరోగ్యం బాగాలేదని, భర్త రణ్వీర్సింగ్తో విభేదాలు తలెత్తాయని ముంబయి మీడియాలో వరుస కథనాలొచ్చాయి.
వీటన్నింటికి చెక్ పెడుతూ పారిస్ ఈవెంట్లో సందడి చేసింది ఈ మంగళూరు సోయగం. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీస్తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. విదేశీ చిత్రాల్లో భారతీయ తారల ప్రాతినిధ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ‘కెరీర్ అంతా అనుకున్నట్లుగానే సాగుతున్నది. ఇతరుల కంటే విభిన్నంగా ఆలోచించడం, లక్ష్యసాధన కోసం అంకితమై జీవితాన్ని సాగించడమే నా విజయ రహస్యం. ఇక నటన ద్వారా నాలాంటి లక్షలాది మహిళల్లో స్ఫూర్తినింపాలని అనుక్షణం తపిస్తుంటా’ అని పేర్కొంది.