నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కుమార్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ‘మనం’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత నాగచైతన్య, విక్రమ్ కుమార్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. మంగళవారం హైదరాబాద్లో ట్రైలర్ను విడుదల చేశారు.
ఓ యువకుడి జీవితంలోని భిన్న దశల ప్రయాణానికి దృశ్యరూపంలా ట్రైలర్ భావోద్వేగభరితంగా సాగింది. ‘మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే మనం చేరిన గమ్యానికి విలువ ఉండదని మా ఫ్రెండ్ చెప్పాడు’ ‘ఒక మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమకంటే స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది’ వంటి సంభాషణలు హృదయాన్ని స్పృశించేలా సాగాయి. దిల్ రాజు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో చైతూ పాత్ర మూడు వేరియేషన్స్తో కనిపిస్తుంది.
థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చైతన్య పాత్రలోని ఎమోషన్స్తో ట్రావెల్ అవుతాం. మనకు ఇష్టమైన వారికి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెబుతాం. అంతలా ప్రతి ఒక్కరిని కదిలించే భావోద్వేగాలుంటాయి. మన హృదయంలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమవుతుంది. జీవితంలో, కెరీర్లో ఏం పోగొట్టుకుంటున్నామో అనే ఆలోచనల్ని కలిగిస్తుంది. నాగార్జునగారి శివ, నిన్నే పెళ్లాడుతా, అన్నమయ్య తరహాలో చైతూ కెరీర్లో ‘థాంక్యూ’ గొప్ప సినిమాగా మిగిలిపోతుంది’ అన్నారు.
టీమ్ అంతా హృదయం పెట్టి చేసిన సినిమా ఇదని దర్శకుడు విక్రమ్ కుమార్ తెలిపారు. నాగచైతన్య మాట్లాడుతూ ‘అభిరామ్ అనే యువకుడి ప్రయాణానికి దృశ్యరూపమే ఈ కథ. జీవితంలోని భిన్న దశల్ని ఆవిష్కరిస్తూ హృద్యంగా సాగుతుంది. అభిరామ్ జర్నీతో ప్రేక్షకులు సహానుభూతి చెందుతారు’ అని చెప్పారు. సినిమాలో ప్రతి సీన్ పెయింటింగ్లా ఉంటుందని, చైతూ కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుందని కథానాయిక రాశీఖన్నా తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.