Thalapathy Vijay | ఒకప్పుడు తమిళ హీరో విజయ్ అన్నా.. ఆయన సినిమాలన్నా తెలుగులో ఇంత కూడా క్రేజ్ ఉండేది కాదు. అప్పుడే వచ్చిన ప్రేమిస్తే భరత్ లాంటి హీరోల సినిమాలు కూడా చూశారు మన ఆడియన్స్. కానీ ఎందుకో మరి విజయ్ను మాత్రం దూరం పెట్టారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అప్పుడు వద్దన్న హీరోనే ఇప్పుడు కావాలంటున్నారు మన దర్శక నిర్మాతలు. ఒకప్పుడు పోస్టర్ ఖర్చులు కూడా రావు ఈయన సినిమాకు అని వెక్కిరించిన వాళ్లే.. ఈయన సినిమా కొంటే చాలు సేఫ్ అయిపోతాం అనే నమ్మకాన్ని కలిగించాడు విజయ్. మరీ ముఖ్యంగా కొన్నేళ్లుగా టాలీవుడ్పై బలంగా ఫోకస్ చేశాడు విజయ్. ఇక్కడి దర్శకులపై కూడా కన్నేశాడు.
గతేడాది వరకు డబ్బింగ్ సినిమాలతో దండయాత్ర చేసిన విజయ్.. మొన్నటి సంక్రాంతికి ఏకంగా వంశీ పైడిపల్లి, దిల్ రాజు లాంటి పెద్ద వాళ్లను వెంట పెట్టుకుని వచ్చాడు. ఓ వైపు చిరంజీవి వాల్తేరు వీరయ్య.. ఇంకోవైపు బాలయ్య వీరసింహారెడ్డి లాంటి సినిమాలతో పోటీ పడి కూడా వారసుడు మంచి వసూళ్లు సాధించింది. ఈ విజయంతో తెలుగు దర్శకులపై విజయ్కు ఎక్కడ లేని నమ్మకం వచ్చేసింది. అందుకే ఇక్కడ ఎవరేం కథలు చెప్పినా వెంటనే వినడానికి డేట్స్ ఇచ్చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే తమిళ దర్శకుల కంటే ఇప్పుడు తెలుగు దర్శకులతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు విజయ్. ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లితోనే మరో సినిమా చేయడానికి ఈయన రెడీ అయిపోతున్నాడు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్తో లియో సినిమా చేస్తున్న విజయ్.. ఆ తర్వాత మరో సినిమా బాకీ ఉంది. ఈ రెండు కమిట్మెంట్స్ తర్వాత మరోసారి వంశీతోనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ లోపు కథ సిద్ధం చేయాలని వంశీకి విజయ్ చెప్పాడని తెలుస్తుంది.
తెలుగులోనూ స్టార్ హీరోలను తన కథలతో మాయ చేసే వంశీ పైడిపల్లి.. అరవంలోనూ అదే మ్యాజిక్ చేస్తున్నాడు. అక్కడ తొలి సినిమాతోనే 300 కోట్ల మార్క్ అందుకున్న ఈయన.. రెండోసారి కూడా విజయ్నే టార్గెట్ చేస్తున్నాడు. వంశీ మాత్రమే కాదు.. మరో ఇద్దరు తెలుగు దర్శకులు చెప్పిన కథలు కూడా విజయ్ విన్నాడని తెలుస్తుంది. వాటిపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది. కచ్చితంగా ఇప్పట్నుంచి తెలుగు మార్కెట్పై మరింత ఫోకస్ చేయాలని చూస్తున్నాడు ఈ తమిళ హీరో. మరి ఈ ఆపరేషన్ టాలీవుడ్ విజయ్కు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.