ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్(TFDA) ఆధ్వర్యంలో ముప్ఫైకోట్ల వ్యయంతో పది సినిమాలు నిర్మించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు TFDA హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించింది. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుతోపాటు అసోసియేషన్ సభ్యులైన వీఎన్ ఆదిత్య, సాయిరాజేష్, సముద్ర.వి, నవీన్ మేడారం, అజయ్కుమార్, టి.ప్రసన్నకుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘కళామతల్లికి చేసిన సేవ వల్లే సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉన్నాను. ఏఎన్నార్, శోభన్బాబు వంటి మహానటులతో సినిమాలు నిర్మించాను. అప్పటి ఇండస్ట్రీ బావుండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నిర్మాతలకు ఖర్చు పెరిగింది. థియేటర్లు తరిగిపోతున్నాయి. సత్తా ఉన్న నిర్మాతలు సినీనిర్మాణానికి దూరమయ్యారు. దాంతో ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. అందుకే.. దర్శకులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను.
విలువలు, కమర్షియల్ అంశాలుండే కథల్ని నిర్మించాలనుకుంటున్నాను. క్రమశిక్షణతో కచ్ఛితంగా ఉదయం ఏడు గంటలకు తొలిషాట్ తీయాలి. క్వాలిటీ ఉన్న మంచి సినిమాలు రావాలి. తద్వారా ఆర్టిస్టులు, దర్శకులు ఇండస్ట్రీలో నిలబడాలి. అదేనాకు పదివేలు. అందుకే ఈ ప్రయత్నం’ అని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల అభ్యున్నతికోసం తన సొంత సంస్థలో 30కోట్ల వ్యయంతో పది సినిమాలు నిర్మించేందుకు ముందుకొచ్చిన అగ్రనిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకి శతసహస్త్ర కృతజ్ఞతాభివందనాలని, ఆయన చేస్తున్న ఈ సత్కార్యం వల్ల అసోసియేషన్లోని దర్శకులతోపాటు దాదాపు నూటయాభైమంది సహాయ దర్శకులకు అవకాశాలు లభిస్తాయని, ఈ సినిమాలకోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, స్క్రిప్ట్స్ని ఎంపిక చేసే బాధ్యత ఈ కమిటీదేనని దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య తెలిపారు.