రోజులన్నీ నిమిషాలైనంత వేగంగా తిరిగిన కాలచక్రంలో మరో ఏడాది ముగింపునకు వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమ తన చరిత్రలో మరో అరుదైన సంవత్సరాన్ని జ్ఞాపకాల్లో పదిలపర్చుకుంది. వందకు పైగా చిత్రాలు..అందులో పదీ పదిహేను శాతం విజయాలు…ఇదీ ఏటా క్లుప్తంగా టాలీవుడ్ గమనం. ఈ ఏడాదిలోనూ ఇదే జరిగింది. అయితే కరోనా భయాలను ఎదిరించి ప్రేక్షకులు తెలుగు సినిమాకు విజయాలు అందించడం ప్రత్యేకతగా నిలుస్తుంది. బాక్సాఫీస్ పోరులో టాలీవుడ్ విజేత అయితే ప్రేక్షకులే వీరులయ్యారు.
సంతోషపెట్టిన ఘన విజయాలు
ఇంటికి పునాది లాగే చిత్ర పరిశ్రమను ఏడాది పాటు కాపాడేది వేళ్ల మీద లెక్కపెట్టగలిగేన్ని ఘన విజయాలే. జట్టులో కొందరే ఆడి గెలిపించినట్లు…ఇక్కడా సరికొత్త ఆలోచనలతో తెరకెక్కిన కొన్ని సినిమాలే మూవీ ఆఫ్ ద ఇయర్గా నిలుస్తాయి. పరిశ్రమను ముందుకు నడిపిస్తాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’, ‘సీతారామం’, ‘మేజర్’, ‘హిట్ 2’, ‘ధమాకా’, ‘18 పేజెస్’, మసూద వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలు సాధించాయి.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు ఖ్యాతి తీసుకొచ్చింది. దాదాపు 1200 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. అంతర్జాతీయంగా పలు పురస్కారాలు గెల్చుకుంది. దర్శకుడు రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్, సెకండ్ బెస్ట్ డైరెక్టర్గా లాస్ ఏంజెలీస్ క్రిటిక్స్ అవార్డ్ దక్కాయి. 30కి పైగా దేశాల్లో ఈ సినిమా ప్రదర్శితమై తెలుగు సినిమా విస్తృతిని చాటింది. స్వచ్ఛమైన ప్రేమ కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని నిరూపించింది ‘సీతారామం’.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు మధురానుభూతిని పంచింది. రామ్, సీత పాత్రలను చిరకాలం గుర్తుంచుకునేలా రూపొందించారు దర్శకుడు హను రాఘవపూడి. అంకితభావంతో చేసే పని అనుకున్నంత విజయం సాధించకపోవచ్చు కానీ అపజయం పాలవదు. ‘బింబిసార’ విషయంలో ఇదే జరిగింది. కళ్యాణ్ రామ్కు ఉన్న మార్కెట్కు ఈ సినిమా అటెంప్ట్ చేయడం సాహసమే. బాహుబలి స్ఫూర్తిగా సెట్స్, కాలగమనంలో సాగే కథతో ఏండ్ల తర్వాత ఓ జానపద కథను ఆకట్టుకునేలా తెరకెక్కించారు దర్శకుడు వశిష్ట. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు తెలుగుకు కొత్త. ఈ కొత్తను విజయవంతంగా పరిచయం చేశారు దర్శకుడు శైలేష్ కొలను. ఈ దర్శకుడు సృష్టించిన ‘హిట్’ యూనివర్స్ ద్వితీయ ప్రయత్నంలోనూ సక్సెస్ అయ్యింది. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘హిట్ 2’ ఫ్రాఫిటబుల్ ప్రాజెక్ట్గా లాభాలు తెచ్చిపెట్టింది.
ఏడాది చివరలో విడుదలైన రవితేజ ‘ధమాకా’ మాస్ ఆడియెన్స్ను ఆకర్షించి విజయాన్ని అందుకుంది. ఫీల్గుడ్ లవ్స్టోరి ‘18 పేజెస్’ కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. నిఖిల్, అనుపమా జోడీ హిట్ పెయిర్ ఈ చిత్రంతోనూ కొనసాగింది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని సాధించింది ‘మసూద’. హారర్ థ్రిల్లర్గా దర్శకుడు సాయికిరణ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆథెంటిక్ హారర్ మూవీగా పేరు తెచ్చుకుంది. థియేటర్లలో ‘డీజే టిల్లు’ చేసిన సందడి కూడా మెప్పించింది. ఈ సినిమా అందుకున్న కమర్షియల్ సక్సెస్ సీక్వెల్స్ తీసేంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది.
తలకిందులైన అంచనాలు
భారీ అంచనాల మధ్య విడుదలైన కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని నిరాశపర్చాయి. మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, సమంత ‘యశోద’, ‘ఎఫ్-3’ చిత్రాలు ఓ మోస్తారుగా ఆకట్టుకోగా, చిరంజీవి, రామ్ చరణ్ ‘ఆచార్య’, నాగార్జున ‘బంగార్రాజు’, ‘ఘోస్ట్’, విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ల ‘లైగర్’, నాని ‘అంటే సుందరానికీ’, రవితేజ ‘రామారావ్ ఆన్ డ్యూటీ’, ‘ఖిలాడీ’, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’, నాగ చైతన్య ‘థాంక్యూ’, గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, రామ్ ‘ది వారియర్’, నాగశౌర్య ‘కృష్ణా వ్రిందా విహారి’, వరుణ్ తేజ్ ‘గని’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయాయి.
అనువాద చిత్రాల హవా
గత కొన్నేండ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న డబ్బింగ్ సినిమాకు మంచి రోజులు వచ్చాయి. ‘కేజీఎఫ్’ ఘన చరిత్రను మరింత ముందుకు తీసుకెళ్తూ సెకండ్ పార్ట్ కూడా సూపర్హిట్ను ఖాతాలో వేసుకుంది. చాలాకాలం తర్వాత కమల్ హాసన్కు తెలుగు తెరపై ‘విక్రమ్’తో మంచి విజయం దక్కింది. ఆయన ఇమేజ్కు తగిన కథతో దర్శకుడు లోకేష్ చేసిన వినూత్న స్క్రీన్ప్లే ప్రయత్నం ఫలించింది. మన జీవనంలో భాగమైన దైవిక ఆరాధనను గుర్తుచేస్తూ, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ తెరకెక్కిన ‘కాంతార’ తెలుగు ప్రేక్షకులను అలరించింది.
మనకేమాత్రం పరిచయం లేని నటీనటులు, నేపథ్యమైనా…దేవుడు అనే కామన్ పాయింట్కు సినిమా చూసే ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ఆధునిక జంటల ప్రేమ కహానీ ‘లవ్టుడే’ తమిళంతో పాటు తెలుగులోనూ యువ ప్రేక్షకులను ఆకర్షించింది. అర్బన్ ఏరియాల్లో మంచి విజయాన్ని సాధించింది. ఇక ప్రపంచ సినీ సునామీ ‘అవతార్, ది వే ఆఫ్ వాటర్’ టాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా అలరించింది.
మన సినిమా ఖ్యాతి దేశమంతా
వివక్షకు గురైన దక్షిణాది సినిమా ఇప్పుడు జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతున్నది. పాన్ ఇండియా సినిమా అప్పుడూ ఉంది ఇప్పుడూ ఉందనే స్టార్స్ కూడా ప్రస్తుతం సౌత్ సినిమాలు దేశీయంగా ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్న తీరును ప్రశంసిస్తున్నారు. తెలుగు నుంచి ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ , ‘మేజర్’, ‘కార్తికేయ 2’, ‘సీతారామం’ వంటి చిత్రాలు జాతీయ స్థాయిలో ఘన విజయాలు అందుకున్నాయి. దేశం కోసం ప్రాణాలర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథను అంతే హుందాగా తెరకెక్కించిన సినిమా ‘మేజర్’. ఈ చిత్ర విజయం హీరో అడివి శేష్ కెరీర్లో మైలురాయిగా మా రింది.
పాన్ ఇండియా విజయాన్ని సాధించిన మ రో సినిమా నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’. కృష్ణతత్వం కథాంశంగా ఎంచుకుని దర్శకుడు చందూ మొం డేటి ఈ సినిమాను రూపొందించారు. ఒక అడ్వెంచర్ జర్నీగా సా గిన ఈ సినిమా పలు రాష్ర్టాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. భాషాతీత ప్రేమానుభూతిని ఉత్తరాది ప్రేక్షకులకూ పంచింది ‘సీతారామం’. పాన్ ఇండియా విజయాన్ని సాధించింది.
ప్రేక్షక హృదయాల్లో చిరంజీవులే
అభిమాన నటులను దూరం చేసిన విషాధాల ఏడాదిగా 2022 ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. రెబల్స్టార్ కృష్ణంరాజు, సూపర్స్టార్ కృష్ణ, దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ, సీనియర్ నటుడు చలపతిరావు నెలల తేడాతో తుదిశ్వాస విడిచారు. నిర్మాత నారాయణదాస్ నారంగ్, దర్శక నిర్మాత బాలయ్య, సినీ గేయ రచయిత కందికొండ, దర్శకులు పీసీ రెడ్డి, మదన్, తాతినేని రామారావు, గానకోకిల లతామంగేష్కర్, సంగీత దర్శకుడు బప్పీలహరి తనువు చాలించారు.