Telugu Cine Directors Association Elections | తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నికలలో గుడుంబా శంకర్ దర్శకులు వీరశంకర్ నేతృత్వంలోని ప్యానల్ ఘన విజయం సాధించింది. కాగా ఈ ప్యానల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన వీరశంకర్ తో పాటు ఉపాధ్యక్షులుగా బేబీ దర్శకుడు సాయి రాజేష్తో పాటు ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ట భారీ మెజారిటీతో గెలుపొందారు.
అయితే వీరశంకర్ ప్యానల్ గెలిచిన సందర్భంగా.. బేబి చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న యువ నిర్మాత ఎస్కేఎన్ (SKN) ఈ విజయోత్సవ సభలో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం కోసం తనవంతుగా రూ. 10 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. తన స్నేహితులైన దర్శకులు సాయి రాజేశ్, వశిష్టకు మద్ధతుగా ఎస్కేఎన్ ఈ విరాళాన్ని అందించారు. ఎన్నికలకు ముందు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేస్తామని సాయి రాజేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. సాయి రాజేష్ మాటకు మద్ధతుగా రూ. 10 లక్షల విరాళాన్ని నిర్మాత ఎస్కేఎన్ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్కు అందించారు. ఇక ఎస్కేఎన్ ఇచ్చిన విరాళం పట్ల తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఇక ఈ ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు సాయి రాజేశ్. ఉపాధ్యక్ష పదవికి పోటీ పడిన సాయి రాజేశ్ కు 576 ఓట్లు వచ్చాయి. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఇన్నేళ్ల చరిత్రలో ఒక పదవికి పోటీ చేసిన వ్యక్తికి ఇంత భారీగా ఓట్లు రావడం ఇదే తొలిసారి.