హైదరాబాద్: సూపర్స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని మరికాసేపట్లో పద్మాలయ స్టూడియోకు తరలించనున్నారు. కార్డియాక్ అరెస్టుతో సోమవారం తెల్లవారుజామున కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రిలో డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత అక్కడి నానక్రామ్గూడలోని తన నివాసమైన విజయకృష్ణ నిలయానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు.
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విజయకృష్ణ నిలయానికి వెళ్లి కృష్ణకు నివాళులు అర్పిస్తున్నారు. అక్కడికి అభిమానులను, సామన్య ప్రజలను అనుమతించలేదు. ఈ క్రమంలో మరికాసేపట్లో ఆయన పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోకు తరలించనున్నారు. అక్కడ ఆయన అభిమానులతోపాటు, సాధారణ ప్రజలకు కృష్ణను కడసారి చూసే అవకాశం కల్పించనున్నారు.
మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం స్టూడియోలోనే కృష్ణ పార్థివదేహాన్ని ఉంచి, సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలను పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిన్న కృష్ణ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. కృష్ణ మృతికి సంతాపంగా చిత్రపరిశ్రమ ఇవాళ తన కార్యకలాపాలను చేసుకుంది.