Tammareddy Bharadwaj | తెలుగు ఇండస్ట్రీలో టికెట్ రేట్ల సమస్య ఉంది. దీని గురించి ఏపీ ప్రభుత్వంతో చర్చించడానికి ఎప్పటికప్పుడు సినీ ప్రముఖులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలుస్తూనే ఉన్నారు. అయితే సినీ పెద్దలు జగన్ను కలిసిన విషయంపై ఇండస్ట్రీలోనే పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ లాంటి వాళ్లు తనకు జగన్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని.. తన సినిమా రెమ్యూనరేషన్ ఎంతో తనకు తెలుసని.. బడ్జెట్ ఎంతో తనకు తెలుసని.. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలని నిర్మాతలకు చెప్పినట్లు బాలయ్య చెప్పాడు. ఇప్పుడు ఇదే టికెట్ల రేట్ల సమస్యపై సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సీరియస్ అయ్యాడు. సినిమా టికెట్ల రేట్లు తగ్గింపు వ్యవహారం అనేది టాలీవుడ్కు ఎలాంటి ఇబ్బంది కాదని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్ చేశాడు.
టికెట్ రేటు తగ్గించడం అనేది ఒక సమస్య కాదని.. కానీ సినిమా ఇండస్ట్రీ సభ్యులు ప్రభుత్వం దగ్గరకు ఎందుకు వెళ్లారో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి. ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా ప్రశ్నలకు సంచలన సమాధానాలు చెప్పాడు. సినిమా ఇండస్ట్రీ టికెట్ రేట్ల తగ్గింపు సమస్య కాదని.. భారీ బడ్జెట్ సినిమాలకు కూడా ఇది సమస్య కాదు. ఎందుకంటే అది విడుదలైనప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ మొత్తం దానికి ఇస్తున్నారు కదా అని సమాధానం చెప్పాడు తమ్మారెడ్డి. ఉదాహరణకు ఆర్.నారాయణమూర్తి నటించిన సినిమా 60 స్క్రీన్లలో వేస్తే.. పెద్ద సినిమాలను మాత్రం దాదాపు ఉన్న 4 వేల స్క్రీన్లలో ప్రదర్శిస్తారు.. కావాలంటే అదే 60 స్క్రీన్లలో నారాయణమూర్తి సినిమా కాకుండా పెద్ద సినిమా వేసి వాళ్లకు కావాల్సిన విధంగా 10 వేల రూపాయల టిక్కెట్లు పెట్టుకోమని సవాల్ విసిరారు.
ఊర్లో ఉన్న అన్ని సినిమా థియేటర్లను కబ్జా చేసి ఇంకా రేట్లు పెంచమని అడుగుతూ ఉంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు తమ్మారెడ్డి. ఇది ఒక రకంగా ప్రేక్షకులను దోచుకోవడం అంటూ ఆయన సీరియస్ అయ్యాడు. ఏపీలో సినిమా టికెట్లు తక్కువగా ఉన్నప్పుడే అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, డీజే టిల్లు లాంటి సినిమాలు విడుదలై విజయం సాధించాయి కదా అని గుర్తు చేశాడు తమ్మారెడ్డి. ఆ సినిమాలకు లేని సమస్య పెద్ద సినిమాలకు ఎందుకు వస్తుంది అంటూ ఆయన ఎదురు ప్రశ్నలు వేశాడు. ప్రస్తుతం తమ్మారెడ్డి ఇంటర్వ్యూ సంచలనంగా మారింది.