లండన్: సింగిల్ డోసు జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు బ్రిటన్ శుక్రవారం పచ్చజెండా ఊపింది. బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హేంకాక్ ఈ సంగతి వెల్లడించారు. విజయవంతమైన బ్రిటన్ టీకాల కార్యక్రమానికి ఈ కొత్త టీకా దన్నుగా నిలుస్తుందని అన్నారు. ఇప్పటి వరకు టీకాల ద్వారా 13 వేల పైచిలుకు ప్రాణాలు కాపాడామని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు జాన్సన్ వచ్చి చేరడంతో ప్రాణాంతక కరపోనా వైరస్పై పోరుకు నాలుగు సురక్షితమైన, ప్రభావయుతమైన టీకాలు అందుబాటులో ఉన్నట్టయిందని అన్నారు. ఈ సింగిల్ డోసు టీకా రాబోయే మాసాల్లో కీలకపాత్ర పోషించగలదని అన్నారు. ఈ టీకా రెండు కోట్ల డోసులకు బ్రిటన్ ఆర్డరు ఇచ్చింది. జాన్సన్ టీకా ఓ మోస్తరు నుంచి తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్ నుంచి 72 శాతం రక్షణ కల్పిస్తుందని పరీక్షల్లో రుజువైంది. ఫైజర్, ఆస్ట్రజెనెకా టీకాలను ప్రధానంగా వినియోగిస్తున్న బ్రిటన్ ఇటీవలే మోడర్నా వ్యాక్సిన్ను ఓకే చేసింది. తాజాగా జాన్సన్ను ఆమోదించడంతో నాలుగు వ్యాక్సిన్లు బ్రిటన్ అమ్ముల పొదిలో చేరినట్టయింది.