రీమేక్ సినిమాలు చేసినప్పుడు పోలికలు రావడం సహజమని అంటోంది తమన్నా. విమర్శలకు భయపడితే పాత్రలకు న్యాయం చేయలేమని చెబుతోంది. బాలీవుడ్లో విజయవంతమైన ‘అంధాధూన్’ సినిమా ‘మాస్ట్రో’ పేరుతో తెలుగులో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. మాతృకలో టబు పోషించిన పాత్రను తెలుగులో తమన్నా చేస్తోంది. తొలుత ఈ పాత్ర కోసం రమ్యకృష్ణ, నదియాతో పాటు పలువురు సీనియర్ నాయికల పేర్లు వినిపించాయి. అనూహ్యంగా తమన్నాకు ఈ అవకాశం దక్కింది. టబు స్థాయిలో ఆమె ఈ పాత్రకు న్యాయం చేయగలదా?లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమన్నా మాట్లాడుతూ ‘నెగెటివ్ షేడ్స్తో కూడిన ఈ పాత్రలో టబుతో నా నటనను పోల్చుతూ అనేక విమర్శలు వస్తాయని తెలుసు. కానీ ఆ పోలికల విషయంలో నాలో ఎలాంటి భయాలు లేవు. టబు క్యారెక్టర్ ప్రభావం నాపై ఉండకూడదనే ‘మాస్ట్రో’ అంగీకరించిన తర్వాత హిందీ వెర్షన్ను చూడలేదు. నిజాయితీతో నా శైలిలో ఈ పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నా’ అని తెలిపింది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్టార్ అనే భావన పూర్తిగా తొలగిపోయిందని, నటీనటుల వ్యక్తిగత ఇమేజ్ కంటే మంచి కథలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తెలిపింది.