సిద్ధార్థ్, దివ్యాంశ కౌషిక్ జంటగా నటిస్తున్న సినిమా ‘టక్కర్’. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ….‘ఈ ఆగస్టుకు నేను హీరోగా పరిచయమై 20 ఏండ్లవుతున్నది. ఇప్పటికీ నాకు మంచి అవకాశాలు వస్తుండటం సంతోషంగా ఉంది. నేను నటించిన పూర్తి కమర్షియల్ చిత్రమిది. దర్శకుడు కార్తీక్ నన్ను సరికొత్తగా తెరపై చూపించాడు. యాక్షన్, రొమాంటిక్ అంశాలతో సినిమా సాగుతుంది. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకే దాదాపు 35 రోజుల సమయం వెచ్చించాం. దివ్యాంశ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ఈ ప్రేమకథ ఈ తరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’ అన్నారు. దర్శకుడు కార్తీక్ జి.క్రిష్ మాట్లాడుతూ…‘ఇది నేటితరం సినిమా అని చెప్పుకోవచ్చు. సిద్ధార్థ్ను లవర్బాయ్లా కొత్తగా చూపిస్తున్నాను. లవ్, కామెడీ, రొమాన్స్ వంటి అంశాలుంటాయి. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది’ అన్నారు. సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ..‘గతంలో సిద్ధార్థ్ సినిమాలు ఎంతగా ఆదరణ పొందాయో చూశాం. ఈ సినిమా కూడా అదే స్థాయి సక్సెస్ అందుకుంటుంది’ అన్నారు.