కంగనా రనౌత్కి కోపమొచ్చింది. నటి తాప్సీపై తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అంతెత్తు లేచింది. నిజానికి వీరిద్దరి వైరం ఈనాటిది కాదు. ఏడేండ్ల క్రితం నాటిది. ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమా టైమ్లో కంగనా సోదరి రంగోలీ.. తాప్సీని ఉద్దేశించి ‘చౌకబారు కాపీ’ అని సంబోధించడంతో ఈ గొడవకు బీజం పడింది. ఆ వెంటనే నెపోటిజం చర్చల సమయంలో తాప్సీ, స్వరా భాస్కర్లను కంగనా ‘బీ-గ్రేడ్ నటీమణులు’ అనడంతో ఈ వివాదం మరింత రాజుకున్నది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య అప్పట్లో మాటల యుద్ధమే జరిగింది. కొంతకాలానికి గొడవ సద్దుమణిగింది.
ఇక ప్రశాంతంగా ఉంటున్నారులే అనుకునేలోపు మళ్లీ వారిద్దరి మధ్య తాజాగా మాటల యుద్ధం మొదలైంది. గత వివాదం, విభేదాల గురించి తాజా ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ ‘వివాదం జరిగిన నాటి నుంచి నేటి వరకూ కంగనాను నేను వ్యక్తిగతంగా కలవలేదు. సంస్కారాన్ని బట్టే మాట తీరు ఉంటుంది. పెంపకం సరిగ్గా లేనప్పుడు సంస్కారం రమ్మన్నా రాదు. ఆమె విధానం అది. ఎవరు ఎక్కడ్నుంచి వచ్చారో తెలుసుకోవడానికి ఇదే నిదర్శనం’ అంటూ వ్యాఖ్యానించింది. ఇక మీడియాలో ఈ ఇంటర్వ్యూ చూసి కోపంతో రగిలిపోయిన కంగనా.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. ‘తన బీ-గ్రేడ్ సినిమాల ప్రమోషన్ల కోసం చౌకబారు కాపీ మళ్లీ బయటకొచ్చింది.
హెడ్ లైన్స్లో ఉండాలంటే నాలాంటి వాళ్ల పేరు వాడుకోవడం తప్ప తనకు వేరే దారి లేదు. ఈ రోజు నా తల్లిదండ్రుల పెంపకం గురించి మాట్లాడి లిమిట్స్ దాటింది. ఎంత గొడవైనా వారి తల్లిదండ్రుల గురించి మాత్రం నేను తప్పుగా మాట్లాడను. ఇలాంటి చౌకబారు కాపీని కన్నందుకు తన తల్లిదండ్రుల్ని చూస్తుంటే జాలేస్తున్నది. నిజమైన బిడ్డకు వారెందుకు జన్మనివ్వలేకపోయారో పాపం..’ అంటూ తాప్సీపై విరుచుకుపడింది కంగనా రనౌత్. ప్రస్తుతం వీరిద్దరి గొడవ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.