సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మళ్లీ మెగా ఫోన్ పట్టి, ‘వేదవ్యాస్’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది దర్శకునిగా ఆయన 43వ చిత్రం కావడం విశేషం. ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సాయిప్రగతి ఫిల్మ్స్ పతాకంపై కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం కె.అచ్చిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన బర్త్డే వేడుకల్లో ‘వేదవ్యాస్’ కథానాయకుడు పిడుగు విశ్వనాథ్ను మీడియాకు పరిచయం చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘విశ్వనాథ్ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. తను ప్రతి సన్నివేశంలోనూ అద్భుతంగా నటించాడు. ఇందులో వేదనారాయణ అనే పాత్ర కీలకం. ఆ పాత్రను సాయికుమార్ పోషించారు.
కొరియన్ అమ్మాయి జున్ హ్యున్ జీ కథానాయికగా నటిస్తున్నది. తను తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాల గొప్పదనం చాటేలా సినిమా ఉంటుంది.’ అని తెలిపారు. ఎస్వీ కృష్ణారెడ్డి పట్టుదలతో తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఇదని, అయిదారేళ్లుగా ఆయన ఈ మూవీ కోసమే వర్క్ చేస్తున్నారనీ, సినిమా బాగా వస్తున్నదని, రషస్ చూశాక ఎస్వీకృష్ణారెడ్డి జడ్జిమెంట్ ఎంత గొప్పదో అర్థమైందని, కొమ్మూరి ప్రతాపరెడ్డి మంచి ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమర్పకుడు అచ్చిరెడ్డి పేర్కొన్నారు. ఇంకా హీరో పిడుగు విశ్వనాథ్, నటుడు సాయికుమార్, జర్నలిస్ట్ ప్రభు, పిడుగు సుబ్బారావు కూడా మాట్లాడారు.