ఢిల్లీలో హృదయవిదారక పరిస్థితులు
శ్మశానాల్లో జాగాలేక ఇండ్లల్లోనే శవాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: కరోనా విలయతాండవంతో దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎన్నడూ చూడని హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్ వల్ల మరణించిన వారికి అంత్యక్రియలు చేసేందుకు శ్మశానాల్లో జాగా ఉండటంలేదు. దీంతో ఒకేసారి పలు మృతదేహాలకు పక్కపక్కనే పెట్టి దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఒక్కో శ్మశానవాటికలో రోజుకు 75కు పైగా మృతదేహాలకు అంత్యక్రియలు జరుపుతున్నట్టు షహీద్ భగత్సింగ్ సేవాదళ్ సంస్థ వ్యవస్థాపకులు జితేందర్సింగ్ షంటీ తెలిపారు. అయినప్పటికీ, వందలాది మృతదేహాలతో కూడిన అంబులెన్సులు శ్మశానాల బయట కొన్ని గంటలపాటు వేచి చూస్తున్నాయన్నారు. కొన్నిసార్లు పదుల మృతదేహాలకు మూకుమ్మడిగా దహనసంస్కారాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. శ్మశానంలో స్థలం లేకపోవడంతో తన తల్లి మృతదేహాన్ని రెండ్రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకున్నట్టు ఢిల్లీ నివాసి నితీశ్కుమార్ పేర్కొన్నారు. ఆరోగ్యకార్యకర్త అయిన తన తల్లికి పది రోజుల క్రితం వైరస్ సోకిందని, అయితే, దవాఖానల్లో పడకల కొరతతో ఆమెను ఎవరూ చేర్చుకోలేదని ఆయన వాపోయారు. చివరకు రెండురోజుల క్రితం తన తల్లి మరణించిందని, అంతిమ సంస్కారాలు చేయడానికి కూడా చాలా కష్టపడ్డట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.